స్వతహాగా తనయుల సినిమాల విషయంలో నాగార్జున విపరీతమైన జోక్యం చేసుకుంటాడని టాక్. అది నిజం కూడా. కథ దగ్గర్నుంచి మొదలుకుని, ప్రమోషన్ వరకూ నాగార్జున ప్రమేయం తప్పని సరి. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, చివరి నిమిషాల్లో రీషూట్లు చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే `మజిలీ` మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పుకోవాలి. ‘మజిలీ’ విషయంలో నాగార్జున ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఇప్పటి వరకూ నాగ్ ఈ సినిమానే చూడలేదు. కథ విన్న తరవాత నాగార్జున ఒక్క డౌట్ కూడా అడక్కుండా ఓకే చేసిన స్క్రిప్టు ఇదే అని తెలుస్తోంది.
మేకింగ్ విషయంలోనూ నాగార్జున ఎలాంటి ఆరాలూ తీయలేదట. ‘సినిమా చూస్తారా?’ అని అడిగినా `రిలీజ్ అయిన తరవాతే ఈ సినిమా చూస్తా’ అని నాగార్జున చెప్పేశాడట. చైతూ, సమంతలు కూడా ఈ సినిమాపై ఇదే నమ్మకంతో ఉన్నారు. ”ప్రతీ సినిమాకీ సెట్లో రకరకాల అనుమాలు వస్తుంటాయి. కథ ఎంత నచ్చినా, ఈ సీన్ వర్కవుట్ అవుతుందా, లేదా? అనే డౌట్లు ఉంటాయి. కానీ అలాంటి అనుమానాలేం లేకుండా హాయిగా పనిచేసిన సినిమా ఇదొక్కటే” అని చైతూ చెబుతున్నాడు. టీజర్, ట్రైలర్ లు చూశాక ‘మజిలీ’పై నమ్మకాలు పెరిగిపోయాయి. ఈమధ్య కాలంలో పూర్తి పాజిటీవ్ బజ్తో విడుదల అవుతున్న సినిమా ఇదేనేమో. మరి ఆ అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.