గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్లో హతమైనా అతడి లాంటి వాళ్లు హైదరాబాద్ లోఇంకా ఉన్నారని స్పష్టంగా కనిపిస్తోంది. కబ్జాలు, బెదిరింపుల వంటివి నయీం దందాలు. ఇప్పుడు నయా నయీంలలో కొందరు కబ్జాలు, మరికొందరు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వగైరా దందాలుచేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకడైన సత్తూ సింగ్ అనే వ్యక్తి కారణంగా నానక్ రాం గూడలో ఆరంతస్తుల భవనం కూలి అమాయకులు బలయ్యారు.
గుడుంబా వ్యాపారంతో మొదలైన సత్తూసింగ్ అక్రమాలు అనుమతిలేని అక్రమ నిర్మాణాల స్థాయికి ఎదిగాయి. ఈ క్రమంలో రాజకీయ, అధికారిక అండ కూడా అతడికి తోడైనట్టు ఆరోపణలున్నాయి. రౌడీ షీటర్ అయిన సత్తూ సింగ్ అక్రమ నిర్మాణాల చిట్టా విప్పితేమరెన్ని అక్రమాలు బయటపడతాయో.
భవన నిర్మాణానికి అనుమతి తీసుకోక పోవడమే కాదు, నాసిరకం పనులు కూడా ఈ దారుణానికి కారణమయ్యాయి. ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లోని అవినీతి అధికారులకు కాసుల పంట పండిస్తున్నాయి. ఒక్కో అక్రమ భవనానికి దాని స్థాయిని బట్టి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకూ లంచాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. జోన్ నుంచి డివిజన్ స్థాయి వరకూ అందినకాడికి లంచాలుదండుకోవడంపై ఉన్న శ్రద్ధ, అక్రమ నిర్మాణాలను ఆపడంలో లేదు.
హైదరాబాద్ లో ఇటీవల ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెరిగాయని తెలుస్తోంది. 100, 150 గజాల స్థలంలో నాలుగైడు అంతస్తులు నిర్మించడంతో అవి కూలిపోతున్నాయి. చెరువులు, నాలాల స్థలాలను కబ్జా చేసి భవంతులు కట్టడం ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి వాటిపై ఉక్కు పాదం మోపుతామని కేసీఆర్, కేటీఆర్ ఘాటుగా ప్రకటనలు చేసినా వాస్తవం మరో విధంగా ఉంది.
జిహెచ్ ఎంసిలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులను మేనేజ్ చేయడం ద్వారా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. నగరంలో సత్తూ సింగ్ లాంటి వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారని అధికార వర్గాలే ఒప్పుకుంటున్నాయి. వాళ్లకు రాజకీయ అండకూడా ఉందని తెలుస్తోంది. కొందరికి మంత్రుల స్థాయిలోనూ సంబంధాలున్నాయట. అదే నిజమైతే ఇక, అక్రమాలకు అడ్డేముంది?