స్వాతంత్ర్యం వచ్చిదని దేశమంతా 1947 ఆగస్టు 15న సంబరాలు చేసుకుంటుంటే హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆరోజు నుంచీ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ మాత్రం భారత యూనియన్ కు బదులు పాకిస్తాన్ లో కలవాలని నిర్ణయించాడు. ఖాసిం రజ్వీ అనే రాక్షస సలహాదారు మాటలు విని నిజాం కూడా కర్కశుడిగా మారాడు. అప్పుడే, రజాకార్ల రాక్షసకాండ మొదలైంది.
13 నెలల పాటు రజాకార్ల అకృత్యాలు కొనసాగాయి. హత్యలు, మానభంగాలు, లూటీలు, హింసాకాండకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మరోవైపు, తెలంగాణ రైతులు నాగలిని పక్కనబెట్టి తుపాకీ చేతబట్టి యుద్ధం కొనసాగించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ జనం తిరుగుబాటు గళమెత్తింది. చివరకు విదేశీ వ్యవహారాలు మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ నిజాం పూర్తి స్వతంత్ర దేశ రాజుగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించుకోవచ్చని అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ ఓ ప్రతిపాదన చేశాడు. దీనికి నెహ్రూ ప్రభుత్వం అంగీకరించి సంతకం చేసింది. నిజాంను స్వతంత్ర రాజుగా గుర్తించడానికి రాతపూర్వకంగా అంగీకరించింది. నిజాం మాత్రం ఒప్పుకోలేదు. పూర్తి స్థాయి స్వతంత్ర రాజుగా ఉంటానన్నాడు.
మరోవైపు రజాకార్ల అరాచకాలు మితిమీరి పోయాయి. తెలంగాణలో ఆడవాళ్లకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఈ దారుణాల గురించి తెలిసిన అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఇక సహనం వద్దని నిర్ణయించారు. నెహ్రూ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా నిజాం సంస్థానంపైకి సైన్యాన్ని పంపాడు. దానికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. 1948 సెప్టెంబర్ 13న కేంద్ర బలగాలు నిజాం సైన్యంపై దండెత్తాయి. నాలుగే రోజులు. నిజాం నవాబుకు తన సైన్యం సత్తా ఏంటో తెలిసింది. లొంగుబాటుకు సిద్ధమంటూ చేతులెత్తేశాడు. అప్పుడు…. సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో దిగారు. వెంటనే నిజాం రెండు చేతులూ జోడించి వంగి వంగి పటేల్ కు దండం పెట్టాడు. తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. ఆనాటి యుద్ధంలో నిజాం సైనికులు 490 మంది హతమయ్యారు. భారత యూనియన్ సైనికులు 32 మంది మరణించారు.
నిజాం లొంగిపోయిన రోజు కాబట్టి దానినే తెలంగాణ విమోచన దినోత్సవం అని పిలుస్తారు. ఆ తర్వాత కూడా నాలుగేళ్ల పాటు నిజాం పేరు మీదే ప్రభుత్వం నడిచింది. అయితే అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరిగింది. ఇప్పటి గవర్నర్ వలె నిజాం ఓ రబ్బర్ స్టాంప్ లా ఉండేవాడు. సెప్టెంబర్ 17, 1948 ప్రత్యేకత ఇదే. అందుకే ఈ వేడుకను అధికారికంగా జరపాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఒకప్పుడు తెరాస కూడా ఇదే డిమాండ్ చేసింది. ఇప్పుడు వైఖరి మారింది. ముస్లిం ఓటు బ్యాంకుతో చక్రం తిప్పే ఎం ఐ ఎం ఎక్కడ బాధపడుతుందో అని కేసీఆర్ ఈ వేడుకను అధికారికంగా జరపడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.