కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లుపై కొద్దిసేపటి క్రితమే రాజ్యసభలో చర్చ మొదలైంది. మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కూడా దానికి మద్దతుగా సభలో మాట్లాడటం ఒక విశేషం అయితే, ఆ బిల్లుని ద్రవ్యబిల్లు అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పడం ద్వారా దానిని చెత్తబుట్టలో పడేయబోతున్నట్లు ముందే స్పష్టం చేయడం మరో విశేషం.
డా.మన్మోహన్ సింగ్ సభలో మాట్లాడుతూ నాడు తను రాజ్యసభలో ఇచ్చిన హామీలపై అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు కూడా సంతృప్తి వ్యక్తం చేసి మద్దతు ఇచ్చారని, ఆ తరువాతే దానిని ఆమోదించిన సంగతిని గుర్తు చేశారు. ఆనాడు ప్రత్యేక హోదా అంశాన్ని మంత్రివర్గం ఆమోదించి రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ జారీ చేయడానికి పంపినప్పటికి ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వలన ఆర్డినెన్సు జారీ చేయలేకపోయామని, కనుక ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయాన్ని, ఆ హామీలని అన్నిటినీ అమలుచేయవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
ఈ బిల్లుని ద్రవ్యబిల్లు అనే సాకు చూపించి తప్పించుకోవద్దని కెవిపి రామచంద్ర రావు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టం అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే చాలని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలుచేయకుండా దానిని ఇంకా ఎందుకు జటిలం చేస్తున్నారు? వాటిని అసలు అమలుచేస్తారో లేదో స్పష్టంగా తెలుపాలని గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. ఏది ద్రవ్య బిల్లో ఏది కాదో, దేనిని ఏ సభలో చర్చించవచ్చో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తమకి రాజ్యాంగం పాఠాలు చెప్పనవసరం లేదని, చితశుద్ధి ఉంటే తక్షణమే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించాలని కపిల్ సిబాల్ జైట్లీకి చురకలు వేశారు.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం మళ్ళీ పాడిందే పాట పాడుతూ, కెవిపి ప్రవేశపెట్టిన బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టిన ఆ బిల్లుపై సభలో ఆ అంశం గురించి జరుగవలసిన చర్చని అది ద్రవ్యబిల్లా కాదా? అని చర్చ జరగడం విచిత్రం. చివరికి అరుణ్ జైట్లీ సూచన మేరకు దానిని లోక్ సభ స్పీకర్ కి పంపి సలహా తీసుకోవాలని నిర్ణయించినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ ప్రకటించారు. అంటే ఈరోజు సభలో దానిపై ఎటువంటి ఓటింగ్ నిర్వహించకుండానే పక్కనే పెట్టేసినట్లు స్పష్టం అవుతోంది. లోక్ సభ స్పీకర్ పరిశీలనకి వెళ్ళిన ఆ బిల్లు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ అది ద్రవ్య బిల్లు అని లోక్ సభ స్పీకర్ నిర్ధారిస్తే దానిపై లోక్ సభలోనే ఓటింగ్ చేపడతామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ పరిణామం ఊహించని కాంగ్రెస్ పార్టీ సభ్యులు షాక్ తిన్నారు.