ఎవరైనా పార్టీ వేదికల మీదేమాట్లాడాలి.. బయట మాట్లాడొద్దు.. ఎంతటి వారినైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బయటకు గెంటేస్తానని స్వయంగా రాహుల్ గాంధీ హెచ్చరించి వెళ్లారు. కానీ ఆయన మాటలను గట్టిగా వారం రోజులు మాత్రమే పాటించారు. ఇప్పుడు మళ్లీ అందరూ కాంగ్రెస్ మోడ్లోకి వచ్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి … ఎక్కడో రెడ్డి సంఘం సమావేశంలో ఆ సామాజికవర్గాన్ని పొగుడుతూ మాట్లాడారని.. ఇతర నేతలు బిలబిలమంటూ తెరపైకి వస్తున్నారు. ఇతర ఏ కులాల్ని రేవంత్ రెడ్డి కించపర్చలేదు. రెడ్డి వర్గాన్ని పొగిడారు.
కాంగ్రెస్కు ప్రధాన ఓటు బ్యాంక్ ఆ సామాజికవర్గం. ఇతర పార్టీల నేతలు రేవంత్ ను విమర్శించారు. అది ఊహించిందే.. అయితే కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ ను విమర్శిస్తూ తెరపైకి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ ఈ అంశంలో ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తూ బహిరంగలేఖ విడుదల చేశారు. మధుయాష్కీకి రేవంత్ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే… ఆయన మాటలను.. సోనియా, రాహుల్ లకు అన్వయించి కించపరిచారన్నట్లుగా ఆరోపణలు చేసి లేఖలు రాశారు. వెలమ నాయకుడి హయాంలో కాంగ్రెస్ 41 పార్లమెంట్ స్థానాలు గెలిచిందని కూడా గుర్తు చేశారు.
మధుయాష్కీ లేఖ ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త చిచ్చుకు కారణం అవుతోంది. రేవంత్ రెడ్డి వ్యూహాలు పార్టీ కోసమేనన్న సంగతి తెలిసి కూడా.. తమకు ప్రాధాన్యం లేదని.. ఎలాగోలా బయటపడాలన్న ఉద్దేశంతో ఇలా లేఖలు రాస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదని.. కొంత మంది కార్యకర్తలు… ఆవేదన చెందుతున్నారు.