ఎన్టీఆర్ – కొరటాల శివల జనతా గ్యారేజ్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆ మిగిలిన పాట ఈరోజు నుంచి చిత్రీకరణ మొదలెడతారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఆల్రెడీ భారీ సెట్ వేశారు. అదో దాబా.. చుట్టూ బోలెడన్ని లారీలు.. మధ్యలో నులకమంచాలు… ఇదీ ఐటెమ్ సాంగ్ ఎఫెక్ట్. వీటి మధ్య ఎన్టీఆర్, కాజల్ చిందులు వేయబోతున్నారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఐదు రోజుల పాటు ఏకధాటిగా ఈ పాటని తెరకెక్కిస్తారు. దాంతో షూటింగ్పూర్తవుతుంది. ఎన్టీఆర్, కాజల్లది హిట్ పెయిర్. ఇద్దరూ కలసి బృందావనం కోసం జోడీ కట్టారు. టెంపర్లోనూ కనిపించారు. ఆ సినిమాలు రెండూ బాగా ఆడాయి. దాంతో… ఎన్టీఆర్ – కాజల్లకు ఇది హ్యాట్రిక్ మూవీ అవ్వడం గ్యారెంటీ అని అభిమానులు అంచనాలు వేసుకొంటున్నారు.
ముందు ఈ పాట కోసం తమన్నాని సంప్రదించారు. తమన్నా బిజీ షెడ్యూల్ వల్ల… ఆమె అందుబాటులో లేకపోయిందట. ఆ తరవాతే ఆఫర్ కాజల్ దగ్గరకు వెళ్లినట్టు సమాచారం. ఈ పాట కోసం కాజల్కి భారీ మొత్తం పారితోషికం గిట్టుబాటు అయ్యిందని తెలుస్తోంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఎన్టీఆర్ ఆల్రెడీ సగం డబ్బింగ్ చెప్పేశాడు. సెప్టెంబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.