వరుసగా మూడు హిట్లు కొడితే ఎవరైనా రిలాక్సింగ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. హ్యాట్రిక్ కొట్టం కదా మనం ఏం చేసినా చల్తా… అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మరింత జాగ్రత్త పడుతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్… ఇలా వరుస విజయాలతో టాప్ ఫామ్ లోకి వొచ్చేసాడు ఎన్టీఆర్. ఫాన్స్ కి ఒకప్పటి ఆది, సింహాద్రి రోజులను గుర్తుకు తెచ్చాడు. జనతా ఐతే ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడే ఎన్టీఆర్ జాగ్రత్త మరింత ఎక్కువయ్యింది. ఈ విజయాన్ని, ఈ వైభవాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చూస్తున్నాడు తారక్. అందుకే ఇప్పుడు జనతా లెక్కలు, తప్పులు తీరిగ్గా తిరగేస్తున్నాడని వినికిడి. ఇప్పటి వరకు జనతా ఎంత వసూలు చేసింది, ఏయే ఏరియాల నుంచి ఎంత వచ్చింది? ఏ ఏరియాల్లో స్ట్రాంగ్ అయ్యాం, ఇంకా ఎక్కడ అవ్వాలి? అనే విషయాలను సన్నిహితులతో చర్చిస్తున్నాడట.
జనతా పై వచ్చిన రివ్యూ లను కూడా చూస్తున్నాడని తెలుస్తోంది. హిట్ కొట్టామంటే అంతా బాగానే ఉందని కాదని, ఈసారి ఎలాంటి తప్పులు రాకుండా జాగ్రత్త పడాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఓవర్సీస్ వసూళ్ల పట్ల ఎన్టీఆర్ కాస్త అసహనంగా ఉన్నట్టు టాక్. అక్కడ మరింత స్ట్రాంగ్ అవ్వడంపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షో ల తరవాత వినిపించిన నెగిటివ్ టాక్ పై కూడా ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశాడని, నెగిటివ్ టాక్ బయటకు రావడానికి కారణాలని విశ్లేషిస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ స్వీయ విశ్లేషణలోకి దిగాడన్నమాట. జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలన్న ఆలోచన ఉత్తమమైనదే. ఎన్టీఆర్ నుంచి మరిన్ని విజయాలు రావడానికి అది దోహదం చేసే అవకాశాలు వున్నాయి.