లాల్ దర్వాజ మహంకాళి ఆలయం. హైదరాబాద్ లో చాలా మందికి దర్శనీయ స్థలం. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధుకు కూడా ఈ అమ్మవారిపై భక్తి ఎక్కువ. పతకం సాధించిన సంతోషంలో శనివారం ఉదయం అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది సింధు.
ప్రతి ఏడాది ఈ ఆలయాన్ని సందర్శించడం సింధుకు అలవాటు. ఒలింపిక్స కు వెళ్లడానికి ముందు బోనాల పండుగ సందర్భంగా కూడా సింధు లాల్ దర్వాజ వెళ్లింది. మహంకాళి ఆలయాన్ని దర్శించుకుంది. అమ్మవారికి బోనం సమర్పించింది. రియోలో పతకం గెలిస్తే మళ్లీ వస్తానని అమ్మవారికి మొక్కుకుందట. అందుకే, మరోసారి వచ్చి మొక్కు చెల్లించింది.
ప్రస్తుతం ఒలింపిక్ విజయానందాన్ని ఆస్వాదిస్తోంది. సింధు. ఇంటర్ వ్యూలు, ఆటో గ్రాఫ్ లు, ఫొటోగ్రాఫ్ లు, ఆత్మీయ పలకరింపులు, మెమొంటోల బహూకరణలు. అంతా కొత్త కొత్తగా ఉంది. ఆమె బ్రాండ్ ఇమేజి కూడా అమాంతం పదిరెట్లు పెరిగింది.
ఒలింపిక్ పతక విజేతగా సింధుకు ఇప్పటికే వివిధ ప్రభుత్వాలు ప్రకటించిన నజరానాల మొత్తం 10 కోట్ల రూపాయలకు పైమాటే. వీటికి ఇళ్ల స్థలాలు అదనం. ఇప్పుడు ఆమె బ్రాండ్ విలువ 2 కోట్లని తాజా లెక్కలు చెప్తున్నాయి. ఆమె బ్రాండ్ అంబాసిడర్ అవుతానంటే అనేక కంపెనీలు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్క విజయం సింధు జీవితాన్నే మార్చేసింది. ఆమె ఇన్నేళ్ల శ్రమకు ఇప్పటికి ఫలితం దక్కింది. దేశానికి తన వంతుగా ఓ ఒలింపిక్ పతకాన్ని సాధఇంచి పెట్టింది. తద్వారా ఆమెకు ఆర్థికంగానూ కలిసివస్తోంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.