ప్రజా సమూహంలో భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నాలు చేయడంలో మన పొలిటీషియన్స్ తర్వాతే ఎవరైనా. ఇలాంటి నాయకులు అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో కూడా ఆ బాపతు నాయకులు కొంతమంది విమోచన దినం పేరు చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నర రూప రాక్షసుల్లాంటి నిజాం ప్రభువులు…. ప్రజలను హిసించిన మాట వాస్తవం. అయితే ముస్లిమేతర ప్రజల ఓట్ల కోసం వాళ్ళ రాక్షసత్వాన్ని వాడుకోవాలన్న రాజీయ పార్టీల ప్రయత్నాలు కూడా అంతే జుగుప్సాకరం. కాశ్మీర్లో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్ట్ నాయకులతో, వేర్పాటువాదులతో కూడా శాంతియుతంగా చర్చలు జరపాలి. ఏ ఒక్కరి ప్రాణానికి నష్టం జరగకుండా చూడాలి అని చెప్పే మన నాయకులు…..మనతో కలిసి జీవిస్తూ మనలో భాగమైన కొంతమంది ప్రజలను బాధపెట్టే యాక్టివిటీస్ చేయడానికి మాత్రం మహా ఉత్సాహంగా ముందుకువస్తారు. సెప్టెంబర్ నెల ప్రారంభం అయిన దగ్గర నుంచి .. జరిగిన చరిత్రను నిజాయితీగా చెప్పాలనే ప్రయత్నం కంటే కూడా ఆనాటి చరిత్రను నేటి రాజకీయ అవసరాల కోసం వాడుకుందామనే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి స్పీచ్లోనూ ప్రత్యేక తెలంగాణా కాలం నాటి అవమానాలను సీమాంధ్ర ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. తెలంగాణా రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకూ సైలెంట్గా ఉన్నాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టి తన ఆవేధన మొత్తం వ్యక్తం చేశాడు. పొలిటికల్ పార్టీ పెట్టేశాడు. ఆ తర్వాత నుంచి ఎన్నికల ప్రచారంలోనూ తెలంగాణా ఉద్యమ సంగతులను చాలా వాటిని గుర్తు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. విభజన కాలం నాటి విషయాలను ఇరు రాష్ట్రాల ప్రజలూ కూడా మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కెసీఆర్, చంద్రబాబులు కూడా సంయమనం పాటిస్తున్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో పరుషంగా మాట్లాడిన కెటీఆర్, కవిత, హరీష్రావులు ఇప్పుడు తమ వైఖరి మార్చుకుని మరీ ఆంధ్రప్రదేశ్ గురించి సానుకూలంగానే మాట్లాడుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నుంచి హైదరాబాద్లో ఉంటున్న సీమాంధ్రులు కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవడం లేదు.
ఇలాంటి సమయంలో పాత గాయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం మాత్రం మంచిది కాదు. అది కూడా అసందర్భంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉన్న విభేదాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను రెచ్చగొట్టడానికి మాట్లాడడం లేదు. జరిగిన విషయాలు చెప్తున్నాను అని పవన్ అంటున్నాడు కానీ పవన్ మాటలు మాత్రం వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. పవన్ సభలో ముందు వరుసల్లో ఉన్న యువకుల ఘాటు స్పందనలే ఆ విషయాన్ని తెలియచేస్తున్నాయి. వచ్చే సభల నుంచి అయినా తెలంగాణా ఉద్యమ కాలంలో సీమాంధ్రప్రజలు ఎదుర్కున్న అవమానాల గురించి మాట్లాడడం మానేస్తే బెటర్ పవన్.