జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు.. ఈ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు మళ్లీ తెరమీదికి వచ్చాయి. ప్రజా పోరాట యాత్రలో ఉన్న ఈ మధ్యనే విజయనగరంలో అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడారు. అశోక్ గజపతిరాజు అంటే తనకు ఎంతో గౌరవమనీ, రాజవంశం మీద గౌరవమన్నారు. అయితే, పవన్ కల్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు. ‘అశోక్ గజపతి రాజుగారూ.. పవన్ కల్యాణ్ అంటే నేనే. నా పేరే పవన్ కల్యాణ్. వీళ్లు నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. నేనే అది.. ప్లీజ్’ అంటూ ఆయన్ని ఉద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే అంశంపై తాజాగా టీడీపీ నేత అశోక్ గజపతి కూడా స్పందించారు.
పవన్ కల్యాణ్ గురించి తనకు తెలియదని మరోసారి అశోక్ జగపతి తాజాగా అన్నారు! తెర ముందు, తెర వెనక పవన్ కల్యాణ్ అంటే తనకు తెలీదన్నారు. అంతేకాదు… ఎవరో తెర వెనక ఉంటూ రాసి ఇచ్చినవి చదువుతూ ఉండటం వల్ల ఆయన గౌరవం కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు! ఇదే సందర్భంలో వైకాపా ఎంపీల రాజీనామాల గురించి కూడా మాట్లాడుతూ… అవి ఆమోదం పొందవని తెలిసే నాలుగో తేదీ తరువాత రాజీనామాలు చేశారని ఆరోపించారు. తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆమోదింపజేసుకున్నాననీ, ప్రజలను మోసం చేయడం కోసమే వైకాపా ఈ రాజీనామా నాటకాలు ఆడుతోందన్నారు.
నిజానికి, పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలీదని దాదాపుగా ఓ ఏడాది కిందట అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఆయనెవరో తెలీదనీ, తాను సినిమాలు చూడటం మానేసి చాన్నాళ్లయిందన్నారు. అక్కడే గొడవ మొదలైంది. ఆ సమయంలో పవన్ స్పందిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. తాను ఎవరో కేంద్రమంత్రిగారికి తెలీదట, సంతోషం అని కామెంట్ చేశారు. సరే, అక్కడితో ఆ విషయం అయిపోయిందనుకుంటే.. ఇప్పుడు విజయనగరం జిల్లాలోకి పవన్ యాత్ర వచ్చాక.. వరుసగా కనీసం ఓ మూడు వేదికల మీద అదే అంశాన్ని పవన్ పదేపదే ప్రస్థావించారు. విశేషం ఏంటంటే… అశోక్ గజపతిరాజు కూడా తాజాగా మరోసారి పవన్ ఎవరో తనకు తెలీదనే అన్నారు! అంటే, దీనిపై పవన్ మరింత తీవ్రంగా స్పందిస్తారేమో..! ఈ టాపిక్ ను ఇక్కడితో ఇద్దరూ వదిలేలా కనిపించడం లేదు కదా!