కేంద్రప్రభుత్వం వేసిన ప్రశ్నలకు సమాధానాలు లేదా అడిగిన వివరాలపై సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు అతిముఖ్యమైన రెండు ప్రాజెక్టులు ప్రశ్నార్ధకమౌతున్నాయి. వాటి నిర్మాణాల్లో ప్రతిష్టంభన, అదితొలగేదాకా జాప్యమూ తప్పనిసరయ్యేలా కనిపిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన పర్యావరణ అనుమతులు గత జూలైలో ముగిశాయి. ఫిబ్రవరి నుంచి పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడునెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ధర్నా చేసి, పనులు నిలిపివేశారు. సమస్యలు చక్కదిద్ది, తుపానులు వచ్చినా పోలవరం పనులు నిలుపుదలచేయరాదని సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అయితే, అనుమతి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ రెన్యువల్ ఇస్తుంది. దీనిపై ఇప్పటికే ఒడిశా, చత్తీస్గఢ్ ప్రభుత్వాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూములు కాకుండా, 13 వేల హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ, పర్యావరణశాఖను కోరింది. అయితే, నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వానికి అటవీ భూములు కేటాయిస్తే, దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడ అడవులు పెంచుతామన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకని, వాటితో ఏం చేస్తారో తమకు ప్రణాళిక పంపాలని కేంద్ర అటవీ సలహా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, ఇప్పటివరకూ దానికి జవాబు పంపించలేదు.
ఈ సమాధానం అందేవరకూ కేంద్రం అటవీ భూములు ఇచ్చే అవకాశంలేదు.
పోలవరం నిర్మాణానికి అనుమతులు ఇస్తే తమకు నష్టమని ఇటీవల రాజ్యసభలో ఒడిషా ఎంపిలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చత్తీస్ ఘడ్ అంతకుముందే పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాన్ని వెలిబుచ్చింది. అయినా అప్పటి పర్యావరణ మంత్రి జవదేకర్ అనుమతులు మంజూరు చేశారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం బిజెపిల మధ్య పొత్తు కుదిర్చిన జవదేకర్ సాన్నిహిత్యం అప్పటి క్లియరెన్సులకు బలంగా ఉపయోగపడింది. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పట్ల రెండు రాష్ట్రాల వ్యతిరేకత. తొలగిపోలేదు….ప్రత్యేకహోదా విషయంగా బిజెపి తెలుగుదేశం పార్టీల సంబంధాలు బిగుసుకుంటున్నాయి..ఈ నేపథ్యంలో, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల పొడిగింపు కొంత అనుమానంగా కనిపిస్తోంది.