ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చాలామంది నేతలు ఆశలు పెట్టేసుకున్నారు! జంప్ జిలానీలైతే మరీ ఎక్కువగా..! తెలుగుదేశంలో చేరడమే తరువాయి, వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అనుకున్న ఆశావహులున్నారు. నిజానికి, తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మంత్రి వర్గ విస్తరణ ఆశలు రెకెత్తించింది. వైకాపా నుంచి వచ్చిన ఓ ముగ్గురు ప్రముఖ నాయకులకు ఆమాత్య పదవులు దక్కుతాయన్న ఆశ ఉండేది. అయితే, రోజులు గడుస్తున్నా విస్తరణపై ఎలాంటి స్పష్టతా రాకపోవడంపై సదరు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది!
మొదటేమో దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుదన్నారు. ఆ తరువాత దీపావళి తరువాత ఖాయమన్నారు. కానీ, ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తున్నా… ఆ సందడే తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదు. ఫిబ్రవరి నుంచి అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చంద్రబాబు సర్కారు డిసైడ్ చేసింది. అయినాసరే, మంత్రిపదవుల ప్రస్ధావనే రావడం లేదు. ఇన్నాళ్లూ లోకేష్ మీద ఈ ఆశావహులకు ఆశలు ఉండేవి! లోకేష్కు మంత్రి పదవి ఇవ్వడం కోసమైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనీ, ఆ తరుణంలో తమకీ పదవులు ఖాయమని అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ టాపిక్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. లోకేష్ కూడా ఇప్పట్లో మంత్రిపదవి చేపట్టేలా లేరు. దీంతో తమ పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి జంప్ జిలానీల్లో ఉంది.
ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇస్తే రాజకీయంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భావనతో పదవులు ఇవ్వకపోయి ఉండొచ్చన్న ఓ అభిప్రాయం కూడా తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతోంది. ‘మరి, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటివారికి పదవులు ఇచ్చారు కదా, వారికి వచ్చిన నష్టమేముంది.? ఆ లెక్కన ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఇబ్బంది ఏముంటుంది..? ఇంకా ఉన్నది రెండేళ్లే. ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తున్నారు’ అంటూ కొంతమంది ఫిరాయింపుదారులు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వారు కూడా వారికి తెలిసిన మార్గాల ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.