రాజీనామా చేస్తానంటున్న రఘురామకృష్ణరాజుకు లోక్సభ స్పీకర్ షాకిచ్చారు. వైసీపీ ఎంపీ భరత్ ఇచ్చిన అనర్హతా పిటిషన్ను లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందుకు పంపారు. నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకు రఘురామకృష్ణరాజుతో పాటు బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి అనర్హతా పిటిషన్ కూడా వెళ్లింది. శిశిర్ అధికారి నేరుగా పార్టీ మారిపోయారు. ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో తృణమూల్ ఆయనపై అనర్హతా వేటువేయాలని పిటిషన్ వేసింది.
రఘురామకృష్ణరాజు ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పార్టీని ఎక్కడా విమర్శించడం లేదు. మా సీఎం అంటూ తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. ఇదే కారణంగా చూపిస్తూ.. ఆయన పార్టీని ధిక్కరించారని చెబుతూ వైసీపీ అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయిస్తేనే అనర్హతా వేటు వేస్తారని.. తాను పార్టీ మారలేదని.. తనపై అనర్హతా వేటు వేయలేరని రఘురామకృష్ణరాజు వాదిస్తున్నారు. తన వాదన కూడా ఇప్పటికే స్పీకర్కు ఇచ్చారు. ఒక వేళ ప్రివిలేజ్ కమిటీ మళ్లీ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తే మళ్లీ అదే వాదన వినిపించే అవకాశం ఉంది.
ఇప్పటికే వైసీపీ నేతలకు వచ్చే నెల మొదటి వారం వరకూ రఘురామ చాన్స్ ఇచ్చారు. ఆ లోపు అనర్హతా వేటు వేయించకపోతే రాజీనామా చేసి.. ఉపఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు అనర్హతా వేటుపై నిర్ణయం తీసుకున్నా… ఉపఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హతా వేటు వేయకపోతే రాజీనామా.. వేసినా పదవి పోతుంది.అప్పుడు ఉపఎన్నికలు ఖాయం. కానీ అనర్హతా వేటు పడితే.. నైతికంగా రఘురామకు ఎదురుదెబ్బ అవుతుంది.