ప్రొ.నాగేశ్వర్: చంద్రబాబు రాజకీయ వైఖరి పదే పదే ఎందుకు మార్చుకుంటారు..?

జమిలి ఎన్నికలకను తానే ప్రతిపాదించానని… టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. లోక్ సభ అసెంబ్లీలకే కాదు.. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను చంద్రబాబు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. జమిలికి మద్దతు ఇవ్వడం లేదంటున్నారు.

ఎన్డీఏ నుంచి బయటకు రాగానే జమిలిపై మారిన వైఖరి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తూ ఏ ఏ వాదనలు వినిపించిందో… తెలుగుదేశం పార్టీ అధినేత కూడా అవే వాదనలు వినిపించారు. ఖర్చు తగ్గుతుందన్నారు. అవినీతి కూడా తగ్గుతుందన్నారు. ఎన్నికల పేరుతో ప్రతీ సారి ప్రభుత్వానికి అగ్నిపరీక్ష ఏమిటని.. అసహనం కూడా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వాదన చేసిందో.. చంద్రబాబు నాయుయు కూడా గతంలో అదే వాదన వినిపించారు. ఇప్పుడు మాత్రం జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకం అని ప్రకటిస్తున్నారు. బీజేపీతో కూటమిలో ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చి…ఎన్డీఏ నుంచి బయటకు రాగానే వైఖరి మార్చుకోవడం ఎందుకు..?. జమిలి ఎన్నికలను ప్రతిపాదించింది లా కమిషన్.. ఆరు నెలల కిందట.. లా కమిషన్ అభిప్రాయం అడిగి ఉంటే.. జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నామని చెప్పి ఉండేవారు. ఇవాళ వెళ్లి మద్దతు ఇవ్వడం లేదని చెప్పేవాళ్లు.

చాలా సందర్భాల్లో భిన్నమైన వైఖరి తీసుకున్న చంద్రబాబు..!

చంద్రబాబు వైఖరి ఇలా మారిపోవడం… ఇదే మొదటిసారి కాదు. తెలంగాణ ఉద్యమకాలంలో చూశాం. మేము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేశారు. సీమాంధ్రలో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రచారం చేశారు. అలాగే ప్రత్యే.కహోదా అవసరమే లేదన్నారు. ప్రత్యేకహోదా సంజీవని కాదన్నారు. ప్రత్యేకహోదాపై పోరాటాలు చేస్తే ఊరుకోబోమన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అద్యాయం అన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకహోదా కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా వద్దని ప్రకటించేశారు. అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ఇదే వైఖరి. ఎన్డీఏలో ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దు తన సూచనేనని చెప్పుకున్నారు. ఇప్పుడేమంటున్నారు.. పెద్ద నోట్ల రద్దు వల్ల నష్టాలొచ్చాయంటున్నారు. నోట్ల రద్దు తర్వాత… క్యాష్ లెష్ ట్రాన్సాక్షన్స్ పై… చంద్రబాబు నేతృత్వంలోనే ఓ కమిటీ వేశారు. ఒకే అంశంపై ఒకే వైఖరిని చంద్రబాబు తీసుకోవడం లేదు. అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అంతే. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందా అన్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా మద్దతిస్తామన్నారు. మళ్లీ వ్యూహం మార్చుకుని టీడీపీ నేతలే అవిశ్వాసం పెట్టారు. అంటే ఒకే అంశంపై మూడు విధానాలు అవలంభించారు.

చంద్రబాబు విధానాన్ని సమర్థింకపోతే.. బీజేపీ ఏజెంట్లా..?

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఖరిని సమర్థించిన వారే… ఏపీకి కోసం పాటు పడుతున్నవారు. టీడీపీ వైఖరి సమర్థించకపోతే.. బీజేపీ ఎజెంట్లుగా ఆరోపిస్తున్నారు. జగన్, పవన్ ను బీజేపీ ఎజెంట్లంటున్నారు. ఇది తెలివైన వైఖరి. ఏపీలో మోడీపై ఉన్న వ్యతిరేకత కారణంగా.. చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరిని, చంద్రబాబును ప్రశ్నించిన వారినీ బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు తేల్చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే.. 2014కి ముందు కాంగ్రెస్ పై ప్రజల కోపాన్ని తమకు అనుకూలంగా ములుచుకుని విజయం సాధించారు. 2012కి ముందు ఉపఎన్నికలు జరిగితే.. వైసీపీ ఘన విజయం సాధించింది. కానీ రెండేళ్లలోనే పరిస్థితిని చంద్రబాబు మార్చేశారు. ఇప్పుడు కూడా దాదాపుగా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్ లోకి బీజేపీని తెచ్చారు. ప్రజల దృష్టిలో బీజేపీని విలన్ గా చూపెట్టడం ద్వారా.. చంద్రబాబు మాత్రమే ఏపీని కాపాడగలరు.. అనే వాతారవణాన్ని క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు ఒక వైపు.. మిగతా అంతా ఒక వైపు అనే పొలరైజేషన్ ను వ్యూహాత్మకంగా చంద్రబాబు తీసుకొస్తున్నారు.

చంద్రబాబు వర్సెస్ మిగతా అందరూ..! ఇది టీడీపీకి ప్లస్..!!

గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ మద్దతు చంద్రబాబుకు కలసి వచ్చింది. ఇప్పుడు అది మైనస్ అవుతుంది. దాన్ని అధిగమించడానికి చంద్రబాబు వర్సెస్ మిగతా అందరూ అనే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబునాయుడు అనుకూల ఓట్లు అన్నీ కలసికట్టుగా ఉంటాయి.. కానీ.. ప్రతిపక్షాల ఓట్లు మాత్రం చీలిపోతాయి. టీడీపీ చాలా వ్యూహాత్మకంగా.. జగన్, పవన్ .. బీజేపీ మనుషులు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసింది.వైసీపీ, జనసేనల వైఖరి వల్ల కూడా.. ఈ అభిప్రాయం ప్రజల్లో మరింత బలపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతోంది. కేసుల భయంతో జగన్ పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. ఫలితంగా ప్రజల్లో బీజేపీతో వైసీపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఈ పరిస్థితిని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.