ప్రొ.నాగేశ్వర్ : రాఫెల్ డీల్‌ స్కాంలో ప్రధానమంత్రి కార్యాలయం..!

రాఫెల్ డీల్ అంశం చాలా పెద్ద కుంభకోణం అన్న అంశంలో రోజుకో కొత్త ఆధారం వెలుగు చూస్తోంది. తాజాగా… అప్పటి డిఫెన్స్ సెక్రటరీ రాసిన అంతర్గత లేఖ వ్యవహారం బయటకు రావడంతో కలకలం రేపుతోంది. నిజానికి ఈ రాఫెల్ వ్యవహారంలో… ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ మోడీ మాత్రం దీనిపై మాట్లాడటం లేదు. రక్షణ మంత్రినో.. మరొకర్నో .. దీనిపై మాట్లాడిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు మరింత తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి.

రాఫెల్‌ డీల్‌పై నేరుగా ఫ్రాన్స్‌తో పీఎంవో చర్చలు..!

రాఫెల్ డీల్ అంశంలో… చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎలాంటి అనుభవమూ లేని పేపర్ల మీదే ఉన్న అనిల్ అంబానీ కంపెనీని దసాల్ట్ ఏవియేషన్ భారత్‌లో అఫ్ సెట్‌ భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి ధరల పెంపుదల వరకూ.. అనేక ‌అవకతవకలు ఉన్నాయని అనేక సార్లు చెప్పుకున్నాం. దీనిలో నేరుగా ప్రధానమంత్రి పాత్ర ఉందనడానికి కూడా.. కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి. గతంలో జరిగిన చర్చలు, ఒప్పందాలను తోసి రాజని.. ప్రధానమంత్రి నేరుగా ఫ్రాన్స్ పర్యటనలో.. కొత్త ఒప్పందం చేసుకుని వచ్చారు. ఈ విషయం అప్పటి రక్షణ మంత్రికి కూడా తెలియదు. పీఎంవో ప్రత్యక్ష ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కానీ.. కేంద్రం మాత్రం.. అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని చెప్పుకుంటూ వస్తోంది. ఇలాంటి సమయంలో డిఫెన్స్ సెక్రటరీ.. మోహన్ కుమార్.. తన స్వంత దస్తూరితో… పీఎంవో జోక్యం ఎక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖ బయటకు వచ్చింది. మామూలుగా అయితే.. ఏడుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ.. ఈ రాఫెల్ డీల్‌ వ్యవహరాన్ని చక్క బెట్టాలి. ఆ కమిటీ పని చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం వారి విధుల్లో జోక్యం చేసుకుంది. ఆ జోక్యంపైనే డిఫెన్స్ సెక్రటరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రక్షణ శాఖ కమిటీకి తెలియకుండా పీఎంవో చర్చించాల్సిన అవసరం ఏమిటి..?

మామూలుగా అయితే.. ఈ కొనుగోళ్ల విషయం ఆలస్యం అవుతుందనో.. మరో కారణం చేతో… పీఎంవో.. వివరణ అడగడమో.. మరోకటే అయితే వివాదం అయ్యేది కాదు. కానీ.. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా.. డీల్‌లో జోక్యం చేసుకుంది. సమాంతరంగా చర్చలు జరిపింది. పీఎంవో కార్యాలయంలోని ఆష్రఫ్ అనే అధికారి.. నేరుగా.. ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ అమ్మకాల కమిటీతో ఫోన్ లో చర్చలు జరిపారు. ఈ చర్చలు.. కమిటీతో పాటు సమాంతరంగా జరిగాయి. చివరికి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఫ్రాన్స్ అధికారి.. లేఖ రాస్తే కానీ.. ఇక్కడ రాఫెల్ కొనుగోళ్లను పరిశీలిస్తున్న కమిటీకి ఈ విషయం తెలియలేదు. డిఫెన్స్ అధికారులకు తెలియకుండా.. నేరుగా… ఫ్రాన్స్ అధికారులతో పీఎంవో ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చింది..?. రహస్యంగా, రక్షణ మంత్రిత్వ శాకకు తెలియకుండా… పీఎంవో ఫ్రాన్స్‌తో చర్చలు జరపడం ఎందుకు..? ఫ్రాన్స్ చెప్పే దాకా పీఎంవో దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచింది..? చర్చలు జరిపే అధికారం… ప్రధానమంత్రి కార్యాలయానికి లేదా అంటే ఉంది. కానీ.. అవి.. దీని కోసం ఏర్పాటైన కమిటీకి అవసరం అయినంతగా ఉండాలి. ఆ చర్చలకు.. మరింత సహకారం అందించినట్లు ఉండాలి. కానీ.. పీఎంవో ఇప్పుడు… రాఫెల్ డీల్ వ్యవహారంలో జరిపిన చర్చలు.. అండర్ మైన్ చేసేలా ఉన్నాయి. ఇది నష్టదాయకం అని రక్షణ మంత్రి దృష్టికి డిఫెన్స్ సెక్రటరీకి తీసుకొచ్చారు. పీఎంవో రహస్యంగా.. ఫ్రాన్స్ తో చర్చలు జరపడం వల్ల… తమ కమిటీ చర్చలు బలహీనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా చర్చించిన విషయాన్ని సుప్రీంకోర్టు దగ్గర ఎందుకు దాచి పెట్టారు..?

ఇటీవల సుప్రీంకోర్టు.. రాఫెల్ డీల్ వ్యవహారంలో విచారణ జరిపింది. ఆ సమయంలో కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో… అసలు పీఎంవో జోక్యమే లేదని చెప్పింది. కానీ నిజానికి నేరుగా.. పీఎంవో కార్యాలయం.. ఫ్రాన్స్ తో చర్చల విషయం దాచి పెట్టారు. సుప్రీంకోర్టు దగ్గర ఈ విషయాన్ని దాచి పెట్టడానికి కారణం ఏమిటి..?. అలాగే… ఫ్రాన్స్ లో ప్రధాని పర్యటన సమయంలో… ఈ రాఫెల్ డీల్ ను.. ప్రకటించారు. అప్పుడు ప్రధాని వెంట అనిల్ అంబానీ ఉన్నారు. ఈ డీల్ విషయం ప్రకటిస్తారని.. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియదు.. రక్షణ మంత్రికి అసలే తెలియదు. ఈ డీల్ సమయంలో రక్షణ మంత్రి అయిన పారీకర్.. గోవాలో..ఓ చేపల మార్కెట్ ను ప్రారంభిస్తున్నారు. అలాగే… ఫ్రాన్స్ మాజీ మాధ్యక్షుడు హోలాండె… కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే… హెచ్‌ఏఎల్ స్థానంలో.. రిలయన్స్ కంపెనీని పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు.

అనిల్ అంబానీ కోసం దేశానికి నష్టం చేశారు…!

ఈ డీల్ లో నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం… జోక్యం చేసుకోవడం వల్ల… దేశం నష్టపోయిందని.. డిఫెన్స్ సెక్రటరీ లేఖ స్పష్టం చేసింది. ఇప్పటికే.. కేంద్రం నిధులు చెల్లించింది. కానీ ఒక్క విమానం రాలేదు. ఒక వేళ కంపెనీ దివాలా తీస్తే… ఆ సొమ్ములు వెనక్కి రాలేదు. ఎందుకంటే.. ఫ్రాన్స్ గ్యారంటీ ఇవ్వలేదు. సహజంగా…ప్రభుత్వం, ప్రభుత్వం మధ్య జరిగితే.. అక్కడి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. కానీ తీసుకోలేదు. లీగల్ ప్రాబ్లం వస్తే.. జెనీవాలో పరిష్కరించుకోవాలనే నిబంధనల పెట్టారు. 300శాతం ఎక్కువ ధర పెరిగింది. అంటే.. పీఎంవో ప్రత్యక్ష ప్రమేయం వల్లనే… అనిల్ అంబానీకి ప్రయోజనాలు కలిగాయన్నది.. కనిపిస్తున్న సత్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.