మొహం మీద కొట్టినట్టు మాట్లాడడం పూరి హీరోలకే కాదు.. పూరీకీ అలవాటే. ఆయన పెన్ను ఈ విషయంలో మహా ఫాస్టుగా పరుగులు పెడుతుంటుంది. ఈసారి ఆయన కన్నూ, పెన్నూ మీడియాపై పడింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇజం’. ఇందులో హీరో క్యారెక్టర్కి రెండు షేడ్స్ ఉంటాయి. ఓ పాత్రలో మీడియా రిపోర్టర్ గా కనిపించనున్నాడు కల్యాణ్రామ్. ఆ పాత్రని ఆధారంగా చేసుకొని మీడియాని కార్నర్ చేసే సీన్లు రాసుకొన్నాడని సమాచారం. మీడియా నైతిక విలువలేంటి? అనే టాపిక్ మీద పూరి సుదీర్ఘమైన సీన్ రాసుకొన్నాడట. అందులో మీడియాని ఎండగట్టే కార్యక్రమం మహా రసవత్తరంగా సాగబోతోందని టాక్. ఈ విషయంలో గురువు రాంగోపాల్ వర్మ కూడా పూరికి కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చినట్టు టాక్. గురువు గారి అండతో పూరి మరింతగా రెచ్చిపోయి ఆ సీన్ని టేకప్ చేశాడట.
ఇది వరకు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ లోనూ ఇదే జరిగింది. సాధారణ వార్తకు మీడియా మసాలా అద్ది ఎలా ప్రసారం చేస్తోంది అనే విషయాన్ని బ్రహ్మానందం – పవన్ ల నేపథ్యంలో కాస్త కామెడీగా తీశాడు. ఆ సీన్లోనే ప్రకాష్రాజ్, పవన్ కల్యాణ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రస్తావన కూడా సాగుతుంది. సరిగ్గా ఇజంలోనూ ఇలాంటి ట్రిక్కే ప్లే చేశాడట. మీడియా ఏమీ లేని చోట పుకార్లను ఎలా వండుతుంది? మైలేజీ కోసం ఎన్ని పాట్లు పడుతుంది? అనే విషయాన్ని సెటైరికల్గా డీల్ చేస్తూ చూపించాడట. అలాగని మీడియాకు నెగిటీవ్ అయిపోతే లేనిపోని సమస్యలొస్తాయి. సినిమా ఫ్లాప్ అయితే అదే మీడియాతో తిట్లు తినాల్సివస్తుంది. అందుకే మీడియాని అక్కడక్కడక హైలెట్ చేస్తూ కొన్ని సీన్లు తీశాడట. ‘ఇజం’ సినిమాపై ఆయా సన్నివేశాలు చాలా ప్రభావం చూపిస్తాయని తెలుస్తోంది. మొత్తానికి పూరి కి మీడియాపై ఉన్న అక్కసంతా తీర్చుకోవడానికి ‘ఇజం’ అనే ఆయుధం దొరికింది. మరి పూరి ఎంత రెచ్చిపోయాడో, మీడియాని ఎంతగా రెచ్చగొట్టాడో తెలియాలంటే ఈ సినిమా రావాల్సిందే.