జీవం, జీవితం నిన్నా నేడూ రేపూ నీటితోనే ముడిపడిందన్న జ్ఞానం ఇచ్చిన పూర్వీకుల దివ్య స్మృతులను భక్తి శ్రద్ధలతో మననం చేసుకునే ఒక సామాజిక సంస్కారమే నదీ పుష్కరం.
ప్రవాహపు ఒడ్డున ఒదిగి ఒదిగి నివశించిన మనిషి, తన అవసరాలకోసం నీటిని కడవల్లోనో, కుంటల్లోనో దాచిపెట్టుకున్నాడు. మిట్టపల్లాల సత్యాన్ని తెలుసుకున్నాడు. ప్రవాహాన్ని ఆపడంలో ప్రమాదాన్ని గుర్తెరిగి నీటితో చెలిమి చేశాడు.ఊరుఊరంతా దోసిలి పట్టినట్టు చెరువు తవ్వుకున్నాడు. వరస చెరువులతో నది కంఠానికి హారం వేశాడు. చినుకు పడినప్పుడు విత్తనం వేసి తిండి గింజలు పండించాడు.
వాన వరదైనప్పుడు అలుగు పారించాడు. ఇళ్ళను ముంచెత్తకుండా కరకట్ట కట్టుకున్నాడు. కోపగించవద్దని కృష్ణవేణిని మొక్కుకున్నాడు. కరుణించినందుకు నదీపూజ చేశాడు. పట్టనంత వరదవచ్చి పంట నాశనమైనపుడు అపచారం జరిగిందని చెంపలు వేసుకున్నాడు.
జీవం, జీవితం నిన్నా నేడూ రేపూ నీటితోనే ముడిపడిందన్న జ్ఞానం ఇచ్చిన పూర్వీకుల దివ్య స్మృతులను భక్తి శ్రద్ధలతో మననం చేసుకునే ఒక సంస్కారాన్ని పొందాడు. దానిని మంత్ర సహితమైన క్రతువుగా మార్చాడు. అగ్నిని సాక్షిగా వుంచాడు. పన్నెండేళ్ళ కొక సారి నదీతీరంలో మానవ సమాజాలన్నీ కలవడానికి నదీస్నానాన్ని నియమం చేశాడు.
పూర్వీకుల పేరు నిలబెట్టేది దానమో, ధర్మమో, సంతానమో…ఏదో ఒకటి అయివుండాలి కనుక ఆ బాధ్యత నిర్వర్తించానన్న సంతృప్తి పుష్కరయాత్ర – వారసులకు మిగులుస్తుంది.
కాలధర్మం చెందిన, అయిన వారి జ్ఞాపకాలను స్పృశించే సామూహిక క్రతువే పుష్కరాల్లో పిండ ప్రధానమని అనుభవమయ్యింది. వారసుల ఉనికికి క్షేత్రాలూ,బీజాలు అయిన తల్లిదండ్రుల…వారి పెద్దల పట్ల కృతజ్ఞతలు భక్తి శ్రద్ధలు వ్యక్తపరచే ప్రాచీన సాంప్రదాయమే నదీ పుష్కరం!!
(2016 ఆగస్టు 12 న కృష్ణా పుష్కరాలు ప్రారంభం)