రాహుల్ వస్తాడు.. ఉత్సాహం తెస్తాడని.. చాలా రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. 13వ తేదీన రంగారెడ్డి, 14వ తేదీన హైదరాబాద్లలో జరిగే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొంటారు. రెండు రోజుల పర్యటనకు వస్తున్నందున వీలైనన్ని వర్గాలతో సమావేశాలు పెట్టేలా టీకాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాలతో సబంధంలేని మేధావులు,చిన్న పరిశ్రమల యజమానులు, ఉస్మానియా విద్యార్థి సంఘాల నేతలతోనూ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూప్ లతో కూడా రాహుల్ ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని హైటెక్స్లో పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. కుదిరితే.. మీడియా సంస్థల అధిపతులతో కూడా రాహుల్ ప్రత్యేక భేటీ అయ్యే అవకాశాలున్నాయట.
ఇంత వరకూ బాగనే ఉన్నా.. కాంగ్రెస్ నేతల వ్యవహారశైలే.. ఆ పార్టీ కార్యకర్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందరూ తమను తాము సీఎం అభ్యర్థులుగా ఊహించుకుంటూ.. ఒకరినొకరు తీసి పారేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తి స్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ తమకు కావాల్సిందేనని విస్తృతంగా లాబీయింగ్ కడా చేసుకుంటున్నారు. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వరుసగా.. తనకు సన్నిహితులందరికీ .. అనధికారికంగా టిక్కెట్లు ప్రకటించేస్తున్నారు.ఈ కారణంగా ఆయనపై ఫిర్యాదులు ఢిల్లీకి జోరుగానే వెళ్తున్నాయి. ఇక రాహుల్..నేరుగా తెలంగాణకు వస్తే ఊరుకుంటారా..?
ఇక కేసీఆర్పై పోరాటం కోసమే కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పటికీ ఆగమ్యగోచరమే. ఇస్తామని చెప్పిన పదవులు ఇవ్వలేదు. అదే సమయంలో… రేవంత్ తో పాటు పార్టీలో చేరిన సీనియర్ నేతలను.. అసలు గుర్తించడం మానేశారు. ఓ బహిరంగసభ పెడతానన్నా.. పర్మిషన్ రావడం లేదు. అయినా రేవంత్ రెడ్డి ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. కాంగ్రెస్ సంస్కృతిని వంట బట్టించుకుని రాహుల్కు విధేయంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు రాహుల్ వస్తున్నారు కాబట్టి.. తన బలమేంటో చూపించి.. తనకు దక్కాల్సిన ప్రాధాన్యం ఎంత ఉందో నిరూపించుకునే ప్రయత్నం రేవంత రెడ్డి చేసే అవకాశం ఉంది. ఇలా పార్టీ నేతలందరూ… ఎవరికి వారు… రాహుల్ ముందు షో చేయడం ఖాయమే. ఇది కొత్త వివాదాలకు దారి తీయకపోతే మాత్రం పాజిటివే. ఒకవేళ తేడా వస్తే మాత్రం కాంగ్రెస్లో అంతే అనుకుని .. లైట్ తీసుకోవాల్సిందేనని కార్యకర్తలు ఫిక్సయిపోయారు.