“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుట్టు రట్టు చేసే పేలుడు పదార్థం లాంటి సమాచారం నా దగ్గరుంది. దాన్ని బయటపెడితే మోడీ బండారం బయట పడుతుంది. అందుకే ఆయన భయపడుతున్నారు. నన్ను లోక్ సభలో మాట్లాడనివ్వడం లేదు”.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణ ఇది. మోడీపైనే పరోక్షంగా చేసిన అవినీతి ఆరోపణ ఇది. ఆ ఆధారాలు ఏమిటో రాహుల్ చెప్పలేదు.
రాహుల్ గాంధీ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆయన వ్యవహార శైలిని గమనించే చాలా మంది రాహుల్ చెప్పే విషయాలను సీరియస్ గా తీసుకోరు. కొందరైతే జోకర్ అని విమర్శిస్తారు. మరికొందరు మాట నిలకడలేని మనిషంటారు. కొందరు మాత్రం ఆయన మంచి నాయకుడని నమ్ముతారు.
బీజేపీ నాయకులు మాత్రం రాహుల్ ను ఓ జోకర్ గానే చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. మోడీపై ఆధారాలున్నాయన్న రాహుల్ మాట ఈ ఏడాది అతిపెద్ద జోక్ అంటూ కమలనాథులు కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కూడా రాహుల్ అన్నారు. భూకంపం రావడం కాదు, ఆయన కాళ్ల కిందే నేల కదిలిపోతుందని బీజేపీ ఎదురు దాడి చేసింది.
మోడీ అనే రెండక్షరాలు వినగానే విరుచుకు పడే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు విచిత్రంగా రాహుల్ మాటను ఓ జోక్ తరహాలో తీసుకోవడం ఆశ్చర్యకరం. నిజంగానే ఆధారాలుంటే బయటపెట్టాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంటులో మాట్లాడనివ్వకపోతే ఆ ఆధారాలను మీడియా సాక్షిగా బయట పెట్టవచ్చు కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంగా రాజకీయ ఎత్తుగడ కావచచని కొందరు పరిశీలకులు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. అదే నిజమైతే రాహుల్ గాంధీ విశ్వసనీయ మరింత తగ్గుతుందేమో !