ప్రొ.నాగేశ్వర్: రాజకీయాల్లోకి రాముడితో పాటు శివుడు, విష్ణువు..!

భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా.. రామ మందిరం చుట్టూ రాజకీయాలు చేస్తోంది. బీజేపీని వ్యతిరేకించేవారందరూ.. ఆ పార్టీ మత ప్రకారం.. ప్రజలందర్ని విభజిస్తున్నారని విమర్శిస్తున్నారు. అది నిజమే. రాముడు.. రథయాత్ర కారణంగానే… రెండు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే సభ్యత్వం ఉన్న ఆ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగలిగింది. బీజేపీ రాజకీయాలు ఎప్పుడూ… రాముడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అధికారంలోకి వచ్చే వరకూ రాముడ్ని వాడుకుంటారు. తర్వాత పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మళ్లీ రామ మందిరం అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌ లో కూడా సొంతంగా అధికారంలో ఉన్నా కూడా.. బీజేపీ రామ మందిరం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.

ఎన్నికల కోసమే రాముడ్ని బీజేపీ వాడుకుంటోందా..?

రామమందిరం విషయాన్ని నాలుగున్నరేళ్లు పట్టించుకోని బీజేపీ.. ఇప్పుడు కొత్త కారణాలు చెబుతోంది. అదేమిటంటే.. రాముడి ఇష్యూ కోర్టులో ఉందని చెబుతున్నారు. అధికారంలోకి రాక ముందు.. హిందూత్వం పేరుతో ఓట్లను పోలరైజ్ చేసుకోవడానికి… విశ్వాసాల్ని కోర్టులు నిర్ణయిస్తాయా అంటూ ఆవేశంగా ప్రసంగించేవాళ్లు. అలా మాట్లాడిన వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కోర్టును కారణంగా చెబుతున్నారు. అంటే.. భారతీయ జనతా పార్టీకి రాముడి గుడి లక్ష్యం కాదు.. రాముడి గుడిని రాజకీయం చేయడమే లక్ష్యం. ఈ విషయంలో బీజేపీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం ఉంది. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి. బీజేపీని ఓ వైపు ప్రశ్నిస్తూనే… మరో వైపు మత పరమైన అంశాలను వాడుకుని రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… అకస్మాత్తుగా శివభక్తుడైపోయాడు. కైలాస్ మానససరోవర్ యాత్రకు పోయి వచ్చారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం అమేధీ వెళ్లారు. అక్కడికి వెళ్లినప్పుడు శివభక్తుడిగా విభూతి పెట్టుకుని.. వెళ్లారు. ఆయనే కాదు.. ఆయన అనుచరులు కూడా.. అదే తరహా వేషధారణలో వెళ్లారు. రాహుల్ గాంధీని ఓ శివభక్తుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు.

రాహుల్ కొత్తగా శివభక్తుని వేషాలెందుకు వేస్తున్నారు..?

రాహుల్ గాంధీ కూడా.. తాను శివభక్తుడినని చెప్పుకున్నారు. రాముడిపై భక్తి చూపడంలో… మోడీ, అమిత్ షా ముందు ఉన్నారు కాబట్టి.. శివుడు ఖాళీగా ఉన్నాడని… రాహుల్ గాంధీ అనుకుని ఉన్నారేమో. బీజేపీ వాళ్లు రాముడి భక్తుల్లా.. రాహుల్ గాంధీ శివభక్తుల్లా… ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. మన దేశంలో హిందూమత భావాలు కలిగిన వాళ్లు… శ్రీరామచంద్రుడ్ని ఆరాధించేవాళ్ల కంటే.. శివభక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారేమోననే లెక్కలు రాహుల్ గాంధీకి ఏమైనా అందాయేమో కానీ.. ఆయన పుల్ టైమ్ శివభక్తుడిగా మారిపోయారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ఆయన శివాలయాలన్నింటినీ తిరిగారు. ఎన్నికల్లో మతాన్ని, మత విశ్వాసాల్ని కూడా వాడుకునేందుకు రాహుల్ గాంధీ … బీజేపీతో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చేస్తే మత రాజకీయాలు అవుతాయి.. కాంగ్రెస్ చేస్తే… లౌకిక వాదం అవుతుంది. అదే సమయంలో ముస్లింల సమావేశం పెట్టి… వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

విష్ణుమూర్తి జపం చేస్తున్న అఖిలేష్ యాదవ్..!

హిందూ మత ఛాందసరవాదమైనా… ఇస్లామిక్ మత ఛాందసవాదమైనా.. దేనిని మనం అంగీకరించకూడదు. ఏ మతాన్ని అడ్డు పెట్టుకుని.. రాజకీయం చేసినా ఖండించారు. కేసీఆర్ .. ప్రెస్‌మీట్‌ టీఆర్ఎస్ లౌకిక పార్టీ కాబట్టి.. బీజేపీతో పొత్తు పెట్టుకోదని ప్రకటిస్తారు. మరి ఎంఐఎం లౌకిక పార్టీనా..?. ఈ రకమైనటువంటి రాజకీయాలు… లౌకిక పార్టీలుగా..చెప్పుకునే పార్టీలు.. మతపరమైన రాజకీయాలు చేయబట్టే బీజేపీ బలపడింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ నేత అఖిలేష్ కొత్తగా విష్ణుభక్తుడైపోయాడు. ఈయన రెండాకులు ఎక్కువే చదివారు. విష్ణుమూర్తి దశావతారాల్లో.. రాముడు ఒకరు. అలాంటిది.. నేరుగా విష్ణుమూర్తికే భక్తుడిగా మారితే.. అధికారం తనకు త్వరంగా అందుతుంది కదా.. అని అఖిలేష్ భావిస్తున్నారు. ఎందుకంటే.. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 70కిపైగా లోక్‌సభ సీట్లు వచ్చాయి. ఎస్పీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడా అడ్రస్ కోసం విష్ణుభక్తుడైపోయాడు. అధికారంలోకి వస్తే.. ఇటావా వద్ద రెండు వేల ఎకరాల్లో విష్ణుమూర్తి నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. కాంబోడియాలో ఉన్న విష్ణుమూర్తి ఆలయాన్ని తలదన్నేలా… యూపీలో అతి పెద్ద ఆలయాన్ని కడతామని చెబుతున్నారు. దాని చుట్టూ.. ఒక మహానగరాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. గుళ్లను నిర్మించాల్సింది రాజకీయ నేతలు కాదు. మత గురువులు,, పీఠాధితులు, భక్తులు నిర్మించుకుంటారు. వాళ్లు నిర్మించుకుంటే తప్పు లేదు. కానీ రాజకీయ నేతలు ప్రభుత్వాలు నిర్మించకూడదు. మతం అనేది ఓ విశ్వాసం. మతం ఆధారాంగా ఉన్న డిమాండ్లను.. ముందు పెట్టి… ఓట్లు తెచ్చుకునే పరిస్థితినే ప్రశ్నించాలి. మత విశ్వాసాలను గౌరవించారు.

మతం వ్యక్తిగతం..! రాజకీయం చేయడం కరెక్ట్ కాదు..!

మత పద్దతుల్ని గౌరవించాలి. కానీ మతం పేరిట ఓట్లు తెచ్చుకునే ప్రయత్నాలను మాత్రం ప్రశ్నించాలి. అఖిలేష్ యాదవ్ చెప్పాల్సింది.. విష్ణుమూర్తి కోసం ఆలయం కట్టిస్తానని… భారీ నగరం నిర్మిస్తానని చెప్పడం కాదు. ప్రతి ఒక్కరి విద్య, వైద్య అందిస్తానని.. పొలాలకు నీళ్లిస్తానని.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పి ఉంటే.. నిజంగా విష్ణుమూర్తి కూడా దీవిస్తారు. ఎందుకంటే.. అన్ని పురాణాలు, ఇతిహాసాలు చెప్పేదేమిటంటే..మానవసేవయే..మాధవసేవ అని చెప్పారు. తనకు ఓ పెద్ద ఆలయాన్ని కట్టిస్తే దీవిస్తానని విష్ణుమూర్తి ఎక్కడా చెప్పలేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు.. నిర్మలమైన… నిష్కల్మషమైన మనస్సుతో ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా… నన్ను ఎవరు అయితే సేవిస్తారో.. వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జునా అన్నాడు. భగవద్గీతలో… ఎక్కడ కూడా.. శ్రీకృష్ణ పరమాత్ముడు.. తనకు ఆలయాన్ని నిర్మించమని చెప్పలేదు. మతాల్ని గౌరవరించాలి. మత భావాల్ని గౌరవించాలి. ఇవన్నీ వ్యక్తిగతంగానే ఉండాలి కానీ.. వీటితో రాజకీయం చేయకూడదు. వాటిని రాజకీయ ఆయుధాలుగా వాడుకోకూడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.