సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యూ టర్న్’ విజయోత్సవ వేడుక (సక్సెస్ మీట్)కి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కుమార్తె కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందుకు కారణం ఏంటో తెలుసా? కవిత ఇద్దరు కుమారులు. ఒక అబ్బాయి ఆరో తరగతి. మరో అబ్బాయి పదో తరగతి. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. వాళ్లు ఇంటికి వెళ్లి సినిమా గురించి అమ్మతో గొప్పగా చెప్పారట! వెంటనే ఆమె సమంతకు ఫోన్ చేసి అభినందించడం, సమంత అండ్ టీమ్… విజయోత్సవ వేడుకకు రావలసిందిగా కోరడంతో అంగీకరించడం జరిగాయి. అసలు విషయం ఏంటంటే… కవితగారు ముందు సినిమా చూడలేదు. కేవలం పిల్లలు చెప్పడంతో సినిమా మెచ్చుకొన్నారు. ప్రజలు యూ టర్న్ తీసుకోవాలంటే భయపడే విధంగా దర్శకుడు పవన్ కుమార్ సినిమా తీశారని అభినందించారు. ఆమె ప్రారంభించిన హెల్మెట్ కార్యక్రమానికి కూడా ఇటువంటి భయపెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తే బావుంటుందేమో అని చమత్కరించారు. ‘రంగస్థలం’ చిత్రానికి, ఈ చిత్రానికి సమంత చాలా వ్యత్యాసం చూపారని కొనియాడారు. నటనతో పాటు సమంత చేస్తున్న సమజాసేవను ప్రశంసించారు. ‘యూ టర్న్’కి వచ్చిన రివ్యూల పట్ల సమంత అమితానందం వ్యక్తం చేశారు. మంచి మంచి చిత్రాలు చేస్తానని, జీవితంలో రాంగ్ టర్న్ తీసుకోనని అన్నారు.