కొన్నినిర్ణయాలకి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వాలు భావించినప్పుడు, దానిపై ప్రజా స్పందన ఏవిధంగా ఉంటుందో తెలుసుకొనేందుకు ముందుగా చూచాయగా వాటి గురించిమీడియాకి లీకులు ఇచ్చి పరీక్షించుకొంటాయి. ఉదాహరణకి విశాఖలో ఏర్పాటు చేయవలసిన రైల్వేజోన్ని విజయవాడకి తరలించబోతున్నట్లు వచ్చిన వార్త కూడా అటువంటిదే.
విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి ఓడిశా ప్రభుత్వం అభ్యంతరం చెపుతున్నందునే విజయవాడలో ఏర్పాటు చేద్దామని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై తెదేపా నేతల, మంత్రుల మౌనం కూడా వ్యూహాత్మకమే. కానీ రైల్వేజోన్ విజయవాడకి తరలించుకుపోతున్నట్లు వార్తలు రాగానే విశాఖలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో, ముఖ్యమంత్రి కూడా ఆ ప్రతిపాదనని గట్టిగా వ్యతిరేకిస్తునారంటూ మీడియాలో వార్తలు (లీకులు) వచ్చాయి. అది ప్రజాగ్రహం నుంచి తప్పించుకోనేందుకేనని చెప్పవచ్చు.
దానిపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటన చేస్తారని చెప్పి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పించుకొన్నారు. ఇప్పటికి జైట్లీ ప్రత్యేక ప్రకటన చేసి వారం రోజులు అవుతోంది కానీ ఇంతవరకు సురేష్ ప్రభు రైల్వేజోన్ ఏర్పాటు గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. బహుశః ఇప్పుడప్పుడే చేయరేమో కూడా.
తాజా సమాచారం ప్రకారం ఓడిశా ప్రభుత్వం రైల్వేజోన్ కి పోలవరానికి ముడిపెట్టినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకి తాము అడ్డుపడకూడదనుకొంటే, విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేసినట్లయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే చాలా బారీగా ఆదాయం కోల్పోతుంది. అందుకే ఓడిశా మొదటి నుంచి విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుని అడ్డుకొంటూనే ఉంది. దానిని పోలవరంతో ముడిపెట్టడం ద్వారా రైల్వేజోన్ని అడ్డుకోగలిగింది.
ఈవిషయం తెదేపాలో అందరికీ తెలిసినా బయటకి చెపితే ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందనే భయంతోనే చెప్పడంలేదని అనుకోవలసి ఉంటుంది. లేకుంటే విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు గురించి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే అధికార పార్టీ నేతలు, మంత్రులు మాట్లాడకుండా ఈవిధంగా మౌనం వహించి ఉండేవారు కాదు.
ప్రత్యేక హోదా విషయంలో కూడా తెదేపా ఈవిధంగానే ప్రజలతో దాగుడుమూతలు ఆడి చివరికి ప్రత్యేక ప్యాకేజి తీసుకొంది. రైల్వేజోన్ విషయంలో కూడా ఇప్పుడు అలాగే వ్యవహరిస్తోంది. ఈవిధంగా ప్రజలని మభ్యపెట్టి ఇప్పటికి సమస్య నుంచి బయటపడవచ్చునేమో కానీ వచ్చే ఎన్నికలలో అది సాధ్యం కాదని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.