జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు పుట్టినరోజు చేసుకోవడం అలవాటు లేదు. అందుకే నిన్నంతా ఆయన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన నటుడు, నేతకి..అభిమానులు.. బర్త్ డే గ్రీటింగ్స్ ట్రెండ్స్లో ఉండేలా చేసుకున్నారు. అంతకు మించి… పవన్ కల్యాణ్కు ట్విట్టర్లో సెలబ్రిటీ విషెష్ వచ్చాయి. అవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్లవి. ఇటీవలి కాలంలో..రాజకీయంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్తున్నా…లోకేష్పై ఆరోపణలు చేస్తున్నా.. అది రాజకీయం కాబట్టి.. వ్యక్తిగతంగా వారిద్దరూ శుభాకాంక్షలు చెప్పారు. వారికి…పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ రిలీజ్ చేసి… ధన్యవాదాలు తెలిపారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ప్రెస్నోట్లో ఉన్న మరో ముఖ్య అంశం.. మీడియా మొఘల్ రామోజీరావు ప్రత్యేకంగా పూలబోకే పంపి.. శుభాకాంక్షలు కన్వే చేయడం. ఇలా చేశారని పవన్ కల్యాణే చెప్పారు. అందుకే అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది.
రామోజీరావుకు ప్రత్యక్షంగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆయన తెర వెనుక పాత్ర పోషిస్తూంటారని.. ఆయనంటే గిట్టని వాళ్లు చెబుతూ ఉంటారు. అందులో ఎంత నిజం ఉందో.. . అలాంటి వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పాలి. కానీ ఇంత వరకూ ఎవరూ అలా రాజకీయ చర్చల్లో రామోజీరావు పాల్గొన్నారని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో జగన్ అనుకూల మీడియా చాలా పెద్ద ఎత్తున రామోజీరావు పాత్రను బయటకు తీసుకొస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు కోసం… గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని చెప్పుకొస్తోంది. అదే సమయంలో ఏపీలో మళ్లీ పవన్ కల్యాణ్ను టీడీపీకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా.. రాసుకొస్తోంది. పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేసిన తర్వాత.. వారిద్దరి మధ్య సఖ్యత ఇక సాధ్యం కాదని.. ఏపీ రాజకీయవర్గాలు అంచనా వేశాయి. అంతకు ముందు జగన్ మీడియా పవన్ విషయంలో కాస్తంత సాఫ్ట్ కార్నర్ చూపించేది. ఇప్పుడది లేదు. ఈ పరిణామాల నేపధ్యంలో రామోజీరావు.. పవన్ కల్యాణ్కు పంపిన బోకే.. ఆసక్తికర మలుపులకు కారణం కానుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమయింది.
కానీ వాస్తవంగా.. రామోజీరావు కానీ.. ఆయన సంస్థలు కానీ.. తమతో అనుబంధం ఉన్న వారికి.. ఇలాంటి శుభాకాంక్షలు తమదైన శైలిలో చతెబుతూనే ఉంటాయి. రామోజీరావు తరపున ప్రత్యేకంగా వారి స్థాయిని బట్టి విషెష్ వెళ్తూనే ఉంటాయి. రామోజీ ఫిల్మ్ సిటీల్లో ఉన్న ద్రాక్ష తోటల్లో పండిన వాటిని… సంస్థలోని ఓ స్థాయి ఉన్నతాధికారులందరికీ.. పంపుతారు. వాళ్లతో పాటు.. ఆత్మీయులకూ ప్రత్యేకంగా పంపించడం రామోజీ ప్రత్యేకత. ఇదే కాదు.. ప్రతి న్యూయర్కి డైరీలతో పాటు విషెష్ కూడా.. ప్రత్యేకంగా.. మనుషుల్ని పెట్టి పంపిస్తూంటారు రామోజీరావు. ప్రజారాజ్యం పార్టీ కోసం.. నాగేంద్రబాబు జిల్లాలు తిరిగినప్పుడు..ఇలా రామోజీ డైరీ ఎప్పుడూ చేతుల్లో ఉంచుకున్నారు. రాసుకోవాల్సినవన్నీ అందులోనే రాసుకున్నారు. ఆ కోణంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దీని వెనుక రాజకీయం ఏమీ ఉండదంటున్నారు. మొత్తానికి లోగుట్టేమిటో పెరుమాళ్లకెరుక…!