సుప్రీమ్ తరవాత రామ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు అనిల్ రావిపూడి. రామ్ ఈ సినిమాలో గుడ్డివాడిగా కనిపించనున్నాడని ప్రచారం కూడా జరిగింది. హైపర్ తరవాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానికి కారణం దిల్ రాజుకీ – రామ్ కీ మధ్య డీల్ కుదరకపోవడమే అని టాక్. రామ్ రూ. 5.5 కోట్ల పారితోషికం అడిగాడట. కానీ దిల్ రాజు అంత ఇవ్వలేను అన్నాడని, రూ. 4.5 కోట్ల దగ్గర ఆగిపోయాడని తెలుస్తోంది. ఈ కథలో కమర్షియల్ అంశాలు వున్నా, రిస్క్ ఫాక్టర్ కూడా ఉందని, అందుకే పారితోషికం తగ్గించుకోమన్నాడట. కానీ రామ్ అందుకు ఒప్పుకోలేదని టాక్.
మరో వైపు ఎన్టీఆర్ కి అనిల్ రావి పూడి చెప్పిన కథ ఇదేనని… రామ్ తప్పుకోవడం తో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ని గుడ్డివాడిగా చూపిస్తే అభిమానులు ఒప్పుకోగలరా అనేదే పెద్ద ప్రశ్న. రామ్ తో చేస్తేనే ఇది రిస్కీ ప్రాజెక్ట్ ఐనప్పుడు… ఎన్టీఆర్ తో చేస్తే ఇంకా రిస్క్ కదా? అందుకే ఎన్టీఆర్ ఆలోచించుకోవడానికి టైం అడిగాడట. దాదాపుగా ఎన్టీఆర్ కూడా ఈ కథ పక్కన పెట్ట్టేసాడని చెపుతున్నారు. దిల్ రాజు మరో హీరోని చూసుకోవాల్సిందే.