వైకాపా ఎమ్మెల్యే రోజా శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినందుకు సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అవడం, హైకోర్టు, సుప్రీంకోర్టులకి వెళ్లి మొట్టికాయలు వేయించుకోవడం, ఆనక క్షమాపణలు కోరుతూ స్పీకర్ కి లేఖ వ్రాయడం గురించి అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆమె వేరేలాగ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. పవన్ కళ్యాణ్ లాగ తాను ప్యాకేజీలు పుచ్చుకోకుండా ప్రజా సమస్యలపై ప్రభుత్వంహో పోరాడినందుకే శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యానని అందుకు తను చాలా గర్వపడుతున్నానని అన్నారు. ఇకపై కూడా ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు.
పవన్ కళ్యాణ్ లాగ ప్యాకేజీ తీసుకొనేందుకు అంగీకరించకపోవడం వలననే శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యానని చెప్పడం గమనిస్తే తెదేపా ఇచ్చిన ప్యాకేజి పుచ్చుకొని ఆ పార్టీలో చేరనందుకే తనపై ప్రభుత్వం కక్ష కట్టి సస్పెండ్ చేసిందని ఆమె చెపుతున్నట్లు భావించవచ్చు.
ఆమెని మళ్ళీ తెదేపాలోకి రప్పించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె స్వయంగా వాటిని ఖండించారు. తెదేపా నేతలు తనని వైకాపా నుంచి దూరం చేయడానికే ఈ ‘బ్రెయిన్ గేమ్’ ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎట్టి పరిస్థితులలో వైకాపాని విడిచి తెదేపాలో చేరే ప్రసక్తేలేదని ఆమె అన్నారు. అంటే తెదేపా ఉద్దేశ్యపూర్వకంగానే దుష్ప్రచారం చేసింది తప్ప అందులో వాస్తవం లేదని ఆమె స్వయంగా చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు తెదేపా ఆఫర్ చేసిన ప్యాకేజిని తీసుకొని ఆ పార్టీలో చేరనందుకే తనపై కక్ష కట్టిందని ఆరోపిస్తున్నారు!
శాసనసభలో అనుచితంగా వ్యవహరించినందుకు క్షమాపణలు కోరుతూ స్పీకర్ కి లేఖ వ్రాసి, మళ్ళీ ఇప్పుడు సభ నుంచి సస్పెండ్ అయినందుకు చాలా గర్వపడుతున్నానని రోజా చెప్పడం ఆమె అయోమయ పరిస్థితిని తెలియజేస్తోంది. తనపై సస్పెన్షన్ ఎత్తివేయించుకొనేందుకు క్షమాపణలు కోరినప్పుడు మళ్ళీ సస్పెండ్ అయినందుకు గర్వపడుతున్నాని చెప్పుకోవడం ఎందుకు? ఒకవేళ ఆమె నిజంగానే గర్వపడుతున్నట్లయితే క్షమాపణలు కోరుతూ లేఖ వ్రాయం ఎందుకు?
ఆమె శాసనసభలో తోటి మహిళా ఎమ్మెల్యే అనిత పట్ల, ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంగతి అందరూ చూశారు. కానీ అది ప్రజాసమస్యలపై పోరాటం అని ఆమె చెప్పుకోవడం మరీ విచిత్రంగా ఉంది. ఆమె నిజంగా ప్రజా సమస్యలపై పోరాడి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యుంటే ప్రజలు, న్యాయస్థానాలు కూడా ఆమె పట్ల సానుభూతి చూపి ఉండేవారు కానీ ఆమె సభలో అనుచితంగా ప్రవర్తించినట్లు నమ్మినందునే ఎవరూ ఆమెపై జాలి పడటం లేదు. సస్పెండ్ అయినప్పటి నుంచి నేటి వరకు ఆ వ్యవహారం గురించి ఆమె మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆమె తీరు ఏమాత్రం మారలేదని స్పష్టం అవుతోంది. కనుక ఆమె సస్పెన్షన్ యధాతధంగా కొనసాగే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చు.