జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ పర్యటన పూర్తయింది. ఈ పర్యటనలో చాలా అంశాలు మాట్లాడారు. కుల రాజకీయాల గురించి, రాజకీయాల్లో మార్పు గురించి చాలా చెప్పారు. ఈ పర్యటన గురించి ‘ఆంధ్రజ్యోతి’ కొత్త పలుకులో సుదీర్ఘ విశ్లేషణ చేసింది. పవన్ వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాలను మెచ్చుకుంటూ, కొన్నింటి తప్పుబడుతూ.. ఓవరాల్ గా జనసేనానికి మరింత స్పష్టత కావాలంటూ బాధ్యతతో కూడిన.. హెచ్చరికతో నిండిన… స్నేహ పూర్వకమైన సలహాలూ సూచనలూ ఇచ్చే విధంగా కొత్త పలుకులో రాశారు.
పవన్ కల్యాణ్ కొన్ని సమస్యలపై స్పందించడం… వాటిని ప్రభుత్వం పరిష్కరించడం జరిగాయి కదా! ఉద్దానం కావొచ్చు, వైద్య విద్యార్థుల ఇష్యూ కావొచ్చు.. పవన్ చెప్పగానే చంద్రబాబు ప్రభుత్వం స్పందించేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రెడిట్ అధికార పార్టీ ఖాతాలో వేసే విధంగా విశ్లేషించడం విశేషం. పవన్ తో సంబంధాలు తెగిపోలేదు కాబట్టే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన లేవనెత్తిన అంశాలపై వెంటనే స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రభుత్వం నుంచి స్పందన ఆగిపోతే… సమస్యలతో పవన్ ను ఆశ్రయించేవాళ్లు కూడా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటారని చెప్పడం గమనార్హం. అధికార పార్టీతో స్నేహం ఉన్నంత కాలమే పవన్ కు ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఓరకంగా పవన్ ను హెచ్చరిస్తున్నట్టే కదా! అధికార పార్టీ మద్దతు ఉంది కాబట్టే.. మీకు ఇంత ప్రాధాన్యత లభిస్తోందన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నంగా చూడొచ్చు. అయితే, ఇదే వాదనను టీడీపీ కోణం నుంచి కూడా విశ్లేషించి ఉంటే బాగుండేది. తమకు మద్దతు ఇచ్చేవారు చెప్పే ప్రజా సమస్యలపై మాత్రమే అధికార పార్టీ స్పందిస్తుందా..? మిగతావాళ్లు చెబితే పట్టించుకోరా..? ఒకవేళ పవన్ మద్దతు ఉపసంహరించుకుంటే… అప్పుడు ఆయన ఎత్తి చూపే సమస్యలో ప్రజా ప్రయోజనాల కోణం అధికార పార్టీకి అక్కర్లేదా..?
ఇక, ఇదే కాలమ్ లో కులాల గురించి పవన్ మాట్లాడిన మాటల్ని మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలో అనుభవజ్ఞులైనవారే ఉండాలంటూ చెప్పిన మాటలూ బాగున్నట్టుగానే ఏకీభవించారు. కానీ, ఇదే తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుకు తానే ఫుల్ పెట్టుకుంటున్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. అమరావతి అద్భుతంగా ఉందని పవన్ చెప్పిన మాటలూ బాగున్నాయన్నారు! ఈ నాలుగు రోజుల పర్యటన తరువాత పవన్ తన వైఖరిని స్పష్టంగా వ్యక్తీకరించలేకపోయారన్నారు. సమాజంలో మార్పు కోరుకుంటున్న పవన్.. ఆ మార్పు ఏంటనే స్పష్టత ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు.
అధికారం లేకపోయినా సమస్యలు పరిష్కరించొచ్చని పవన్ అంటున్నారనీ, కాకపోతే అధికార పార్టీతో అనుకూలంగా ఉన్నంత కాలమే ఆ వెసులుబాటు ఉంటుందని కాస్త గట్టిగా చెప్పే ప్రయత్నమే ఈ కొత్త పలుకు ద్వారా చేశారు. అధికార పార్టీకి పోటీగా తయారైనప్పుడు, ఆ పార్టీ నుంచి స్పందన వేరేలా ఉంటుందని కూడా ముక్తాయించడాన్నే ప్రధానంగా చెప్పుకోవాలి. సో.. వారి విశ్లేషణ ద్వారా పవన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. జనసేనకు లభిస్తున్న ప్రాధాన్యతకు కారణం అధికార పార్టీతో ఉన్న సాన్నిహిత్యమే. అది పోయిన నాడు జనసేనకు ప్రత్యామ్నాయాన్ని జనం చూసుకుంటారని చెప్తున్నారు. అంటే, జనసేనను టీడీపీతో కలిపి ఉంచాలనేదే వారి ప్రయత్నంగా అర్థమౌతూ ఉంది. దాన్ని కూడా జనసేన అవసరం అనే కోణం నుంచే విశ్లేషించి చెప్తున్నారు..! ఇక్కడ వారు మరచిపోయిన గతం ఏంటంటే… గడచిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్నేహం కోసం టీడీపీ అర్రులు చాచింది. మరి, అప్పటి ఆ అవసరాన్ని ఎవరి కోణం నుంచి విశ్లేషిస్తారు..?