మరాఠీ సినిమా సైరత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యావత్ భారతీయ సినిమా మొత్తం మరాఠీ సినిమా వైపు ఆశ్చర్యంగా చూశాయి. నాలుగంటే నాలుగు కోట్లతో పూర్తయిన ఈ సినిమా వంద కోట్లు దాటి వారెవా అనిపించింది. ఒక విధంగా బాహుబలిని మించిన సంచలనం ఇది. సైరత్ ఎప్పుడైతే భారీ హిట్ కొట్టిందో.. ఆ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడానికి మిగిలిన చిత్రసీమలన్నీ పోటీ పడ్డాయి. దక్షిణాది హక్కులు ఇప్పుడు రాక్ లైన్ వెంకటేష్ దగ్గరున్నాయి. నెల రోజులుగా సైరత్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించడానికి ఆయన యుద్ద ప్రాతిపదికపై సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ చేయడానికి హీరో, దర్శకుడు దొరికేశారన్నది టాలీవుడ్ టాక్.
ఈమద్య శ్రీరస్తు శుభమస్తుతో ఓ డీసెంట్ హిట్ కొట్టాడు పరశురామ్. సైరత్ సినిమా రీమేక్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్టు టాలీవుడ్ టాక్. హీరో ఎవరో తెలుసా?? బ్రహ్మానందం తనయుడు గౌతమ్. పల్లకిలో పెళ్లి కూతురు, బసంతి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి కష్టపడ్డాడు గౌతమ్. బసంతి ఓకే అనిపించింది. అప్పటి నుంచీ గౌతమ్కోసం కథల వేట సాగుతోంది. సైరత్ తెలుగు వెర్షన్కి గౌతమ్ అయితే బాగుంటాడని రాక్ లైన్ వెంకటేష్ భావిస్తున్నాడట. ఓ వైపు పరశురామ్.. మరోవైపు గౌతమ్తో రాక్ లైన్ సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గౌతమ్ ఆల్మోస్ట్ ఓకే అనేసినా… పరశురామ్ మాత్రం ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదని తెలుస్తోంది. సైరత్ ఒక విధంగా మరాఠీ క్లాసిక్. అలాంటి సినిమా రీమేక్ చేస్తే.. అదీ గౌతమ్తో ఎలా ఉంటుందో అని పరశురామ్ ఆలోచనలో పడ్డాడట. వారం పదిరోజుల్లో సైరత్ తెలుగు రీమేక్పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.