ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ… తెలుగులో ఈ నాలుగూ ప్రధాన పత్రికలు. ఈ రోజు ఉదయం వీటిలో సినిమా పేజీ చూస్తే… టాప్లో పవన్ కల్యాణ్తో కూడిన నితిన్ ‘చల్ మోహన్రంగ’ ప్రీ-రిలీజ్ వేడుక వార్త కనిపిస్తుంది. పవన్ స్పీచ్లో మాటలు హెడ్డింగ్స్గా పెట్టారు. సాక్షిలో మాత్రం పాఠకులకు పవన్ మాటలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. వాళ్ళు వార్తను కవర్ చేయలేదా? అంటే… చేశారు. కాని అందులో ఎక్కడా పవన్ ఫొటో గాని, స్పీచ్ గాని ఉండదు. జస్ట్… పవన్ కళ్యాణ్ వేడుకకు హాజరైనట్టు రాశారంతే. పవన్ ఫొటో లేకుండా సినిమాలో హీరో నితిన్, హీరోయిన్ మేఘా ఆకాశ్ స్టిల్ వేశారు. మిగతా పత్రికలలో పవన్ మాటలకు, ఫొటోకు అధిక ప్రాముఖ్యత ఇస్తే.. సాక్షిలో అసలు ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ముందుగా సాక్షి పత్రిక చూస్తే ‘చల్ మోహన్రంగ’ వేడుకకు పవన్ వచ్చాడనే సంగతి తెలీదు. అంత నేర్పుగా వార్తను వండి వడ్డించారు.
పవన్ ఫొటోలను సాక్షి విస్మరించడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్, పవన్ మధ్య నవ్వులు చుట్టుపక్కల వారితో పాటు లైవ్ చూసిన ప్రేక్షకులను ఆకర్షించాయి. కాని సాక్షిలో మాత్రం ఆ రోజు పవన్ ఫొటో వేయలేదు. ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పేరు మీద హెడ్డింగ్ పెట్టి, అతడి ఫొటోలు వేసింది. పవన్ పేరును మాటవరసకు రాసింది. ఈ రోజు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. పవన్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ వార్తలను సినిమా వార్తలు కాదన్నట్టు వదిలేసింది.
రాజకీయాల పరంగా పవన్ కల్యాణ్కి, ‘సాక్షి’ అధినేత, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్కి మధ్య ఎలాంటి పరిస్థితులు వున్నాయనేది తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆ రాజకీయాలను సినిమా పేజీలో చూపించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ ఫొటో ప్రచురిస్తే అతడికి ఎక్కువ మైలేజి వస్తుందనే భయంతో ప్రచురించడం లేదా? లేదా కోపంతో అతడి ఫొటోలను విస్మరిస్తున్నారా? తెలుగు ప్రజలకు పెద్ద పజిల్ ఇది. పవన్ ఫొటోలను, వార్తలను వద్దనుకున్నప్పుడు ‘అజ్ఞాతవాసి’ ప్రకటలను ఎందుకు తీసుకొన్నట్టో? వాటిని వదులుకుంటే బాగుండేది కదా. పేజీలో కాస్త చోటుకు ఇంత రేటు అని డబ్బులు కడితే… పవన్ ఫొటోలు వచ్చినా ప్రాబ్లమ్ లేదనుకుంట. వింత ధోరణి ఏమిటో మరి. పవన్ వార్తలతో పాటు ప్రకటనలను వద్దని అనుకుంటే ఓ అర్థం వుంటుంది.