సర్వేలతో చింతకాయలు రాలుతాయా..?.. అలా రాలే పని అయితే.. ఈ పాటికి.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. గత ఎన్నికల ముందు.. అనేకానేక ప్రముఖ సర్వేలు.. జగన్ గెలుస్తాడని..సీఎం అవుతారని.. సర్వేలు ప్రచురించాయి. కానీ.. నిజం కాలేదు. విచిత్రంగా.. ఇప్పటికీ అవే సర్వే సంస్థలు మళ్లీ జగన్ గెలుస్తాడని… అప్పుడప్పుడూ సర్వేలు వెల్లడిస్తూ ఉంటాయి. వాటికి ఉన్న విశ్వసనీయత ఏమిటో చెప్పలేరు కానీ… తమకు అనుకూలంగా వస్తే… మొదటి పేజీలో వేసుకుని… వ్యతిరేకంగా వస్తే.. అసలు వేయకపోవడమో.. లేకపోతే.. దాన్ని ఖండ..ఖండాలుగా ఖండించడమో జగన్ మీడియా చేస్తుంది. ఇందులో వింతేమీ లేదు. కానీ తనకు సంబంధం లేని… వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .. అదీ కూడా… రెండు అసెంబ్లీ స్థానాల్లో ఫలితాన్ని మాత్రమే వెల్లడించిన… లగడపాటిపై… సాక్షి శివాలెత్తిపోయింది. పచ్చ గూటి చిలక అంటూ చెలరేగిపోయింది. తెలంగాణలో మాత్రమే కాదు.. ఏపీలోనూ అదే బ్యానర్గా పెట్టి… తెలంగాణ రాష్ట్ర సమితికి తాను ఎంత హార్డ్ కోర్ సపోర్టర్నే తెలియజెప్పింది.
ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో సాక్షి సండే బ్యానర్ స్టోరీ.. లగడపాటి చెప్పిన రెండు సీట్ల ఫలితంపైనే. ఎనిమిది నుంచి పది సీట్లలో ఇండిపెండెంట్లు గెలుస్తారని…రోజుకు రెండు పేర్లు చెబుతానని.. లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. రెండు పేర్లు ప్రకటించారు. ఆయన సర్వేలపై.. ప్రజలకు గురి ఉంది.. నెటిజన్లకూ నమ్మకం ఉంది. దాంతో.. అందరూ తమకు ఇష్టం వచ్చిన విశ్లేషణలు చేసుకున్నారు. అంతిమంగా తేలిందేమిటంటే… అని అందరూ ఏకగ్రీవంగా అంచనా వేసుకున్న విషయం.. టీఆర్ఎస్కు వ్యతిరేకత ఉందని. అంత వరకూ బాగానే ఉన్నా.. ఇది సాక్షి పత్రికకు కోపం తెప్పించింది. సహజగంగా… వైసీపీ గురించి అలాంటి ప్రకటన చేస్తే… వారికి పూనకం వస్తుంది. కానీ ఈ సారి టీఆర్ఎస్ గురించి రాసినా దాన్ని తెచ్చుకుంటున్నారు. చెడామడా రాసి పడేశారు. దాని కోసం.. సాక్షి మార్క్ జర్నలిజాన్ని పట్టుకొచ్చారు.
లగడపాటి రాజగోపాల్ .. తాను సర్వే చేశానన్న విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. వ్యక్తిగత అభిప్రాయం మాత్రం చెప్పారు. సర్వేను… 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటిస్తానన్నారు. అయినప్పటికీ.. ఆయన సర్వే ప్రకటించారని.. ఎంత శాంపిల్స్.. తీసుకున్నారో.. లెక్క చెప్పాలంటూ వితండవాదం చేశారు. ఇదంతా టీడీపీ కోసం.. లగడపాటి రాజగోపాల్ ఆడుతున్న నాటమని చెప్పుకొచ్చారు. తటస్థ ఓటర్ల మనసు మార్చడానికి చేసిన ప్రయత్నంగా విశదీకరించారు. దీన్ని ఖండించడానికి బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందన సహా చాలా విచిత్రమైన కోణాలు ఆవిష్కరించారు. లగడపాటి చెప్పిన రెండు సీట్ల లెక్కకే సాక్షి ఎందుకు ఇంత హైరానా పడిందో అర్థం కాలేదు కానీ.. రాజకీయ దురుద్దేశాలు..ఆపాదించేశారు.
కొసమెరుపేమిటంటే.. కొద్ది రోజుల క్రితం.. అంటే గత వారంలోనే.. టైమ్స్ నౌ అనే మీడియా సంస్థ టీఆర్ఎస్కు 70 సీట్లు వస్తాయంటూ సర్వే ప్రకటించింది. దాన్ని మొదటి పేజీలో బ్యానర్గా వేసింది సాక్షి. నిజానికి ఆ రోజు సోనియాగాంధీ టూర్కు వచ్చారు. ఆమె వార్త కన్నా ఎక్కువగా ఆ సర్వేకే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చింది కాబట్టి..ఎన్నికల సంఘం నిబంధనలు.. ఓటర్ల ప్రభావితం ఏమీ సాక్షికి కనిపించలేదు… అంటే… అర్థమైపోతుంది కదా.. ఈ చిలుక గులాబీ గూటిదేనని..!