డబ్బులు దండిగా ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్డడానికి అడ్డేముంది. మైనింగ్ మాఫియా అని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి బడా తారలతో డాన్స్ హంగామా చేయించబోతున్నారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లను రప్పిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినంత అడగండి. ఎంత రెమ్యునరేషన్ కావాలన్నా ఇస్తానని గాలి చెప్పాడని వార్తలు వస్తున్నాయి.
ఒబుళాపురం మైనింగ్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లిన గాలి, తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారట. బళ్లారిలోనే కాదు, కర్ణాటకలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా ఇది నిలిచిపోవాలని ఆయన భావిస్తున్నారట. ఈ పెళ్లి వేడుకలో డాన్స్ చేయడానికి సదరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఓకే చెప్పారని సమాచారం.
గాలి కటుంబ సభ్యులు మాత్రం మరికొందరు గ్లామర్ స్టార్స్ కూడా వస్తే బాగుంటుందని భావిస్తున్నారట. తమన్నా, ప్రభుదేవ కూడా వచ్చి డాన్స్ చేస్తే బాగుంటుందని వాళ్ల ఉద్దేశం. ఇంకేం, వాళ్లకూ కబురు వెళ్లింది. అయితే కన్ఫర్మేషన్ ఇంకా వచ్చినట్టు లేదు.
కర్ణాటకలో బీజేపీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా మంత్రిగా చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి, చాలా కాలం జైల్లోఉన్నారు. బళ్లారి ప్రాంతంలో అడ్డూఅదుపూ లేకుండా మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. చివరకు, బెయిలు కోసం జడ్జికి లంచం ఇచ్చిన కేసును కూడా గాలి ఎదుర్కొంటున్నారు. అక్రమార్కుడనే ఆరోపణలు ఉంటేఏమిటి, ఇంకా అవి రుజువు కాలేదు కదా. అందుకే, బాలీవుడ్ బడాస్టార్స్ కూడా అతడి ఇంట్లో పెళ్లి వేడుకకు డాన్స్ చేసి మురిపించడానికి రెడీ అయ్యారు. అడిగినంత డబ్బిస్తానంటే కాదంటారా? డబ్బెవరికి చేదో చెప్పండి !!