భారతీయ జనతా పార్టీ నేతలు కొద్ది రోజుల నుంచి…తెలుగుదేశం ప్రభుత్వంపై ఎప్పుడూ లేనంత అసహనాన్ని చూపిస్తున్నారు. తమపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వం ఉందని వారి అనుమానం. అమిత్ షా తిరుమల టూర్కి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు ఇదే వాయిస్ని చాలా పెద్ద రేంజ్లో వినిపిస్తున్నారు. రెండు సార్లు గవర్నర్ను కూడా కలిశారు. ఓ సారి రాష్ట్రపతి పాలనకు కూడా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా గవర్నర్ను కలిసి.. ఒక్క రోజు గడవక ముందే.. ఏబీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై నెల్లూరు జిల్లా కావలిలో చెప్పు దాడి జరిగింది. దాంతో మరోసారి గగ్గోలు రేగింది. బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
అయితే ఈ దాడిపై టీడీపీని విమర్శించే విషయంలో కన్నా లక్ష్మినారాయణ కాస్తంత కన్ఫ్యూజ్కు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేకే…తనపై చెప్పులతో దాడి చేశారని చెప్పుకొచ్చారు. కన్నా వాదన మరీ కామెడీగా ఉంది. అభివృద్ధి చేస్తే .. పూలతో కొడతారేమో కానీ.. చెప్పులతో కొడతారా..?. కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తి.. ఓ లారీ డ్రైవర్. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. చెప్పు ఎందుకు వేశాడంటే… రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని తట్టుకోలేకే.. కన్నాపై.. చెప్పు విసిరానని.. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అసలు కావలికి చెందిన వ్యక్తే కాదు కాబట్టి… టీడీపీనా..మరో పార్టీనా అన్న డౌట్ అక్కడ రాదు. కానీ బీజేపీ నేతలు టీడీపీపైనే ఆరోపణలు చేస్తారు అది సహజం.
కానీ చెప్పు విసిరిన వ్యక్తిపై బీజేపీ నేతలు వ్యవహరించిన విధానం అత్యంత వివాదాస్పదమయింది. కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుని తమ చెప్పులు తీసి కొట్టారు… బీజేపీ నేతలు. ఇది అందరి ముందే జరిగింది. అంటే.. చెప్పు విసిరిన వ్యక్తికి… బీజేపీ నేతలకు ఎలాంటి తేడా లేదు. ఆయన ఓ లారీడ్రైవర్.. కానీ వీళ్లు బీజేపీ నేతలు. ప్రజల కోసం వచ్చామని చెప్పుకునేవారు. మంచి చేస్తామని చేప్పుకునేవారు. ముల్లును ముల్లుతోనే తీస్తా.. చెప్పుదెబ్బకు చెప్పుదెబ్బలే కొడతాన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తికే సానుభూతి వచ్చింది. అతన్ని కొట్టినందుకు .. బీజేపీ నేతలకు శాపనార్థాలు పడుతున్నాయి.