ప్రభుత్వం ఒక హామీని అమలు చేయకుండా తప్పించుకోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? అని తెలుసుకోవాలంటే ప్రత్యేక హోదా అంశం కేంద్రప్రభుత్వం చెపుతున్న కధలని వింటే అర్ధం అవుతుంది. 2014 ఎన్నికల సమయం నుంచి సుమారు ఏడాదిపాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్య నాయుడు బల్లగుద్ది మరీ చెప్పేవారు. ఆ తరువాత “మధ్యలో 14వ ఆర్ధిక సంఘం సైంధవుడిలా అడ్డుపడింది లేకుంటేనా…”అని కొన్ని రోజులు దీర్ఘాలు తీశారు. ఆ తరువాత “ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు లేకుంటేనా ఎప్పుడో ఇచ్చేసి ఉండేవాళ్ళమి” అని చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తరువాత “అసలు హోదా కంటే చాలా ఎక్కువిచ్చేస్తుంటే వద్దంటారేమిటి మీరు?” అని ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ తరువాత “ప్రత్యేక హోదా పుచ్చేసుకొంటే చాలా నష్టపోతారని” భయపెట్టారు.
అయినా జనాలు మోడీని, బాబుని, జైట్లీని అనుమానంగానే చూస్తున్నారు. ఇక జగన్ సరే సరి. ఆ పేరుతో చంద్రబాబు నాయుడుని ఎప్పుడూ దుమ్ము దులుపుతూనే ఉంటారు. ఇటువంటి సమయంలో కెవిపి రామచంద్ర రావు ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు పెట్టేసి ఒకే దెబ్బకి రెండు పిట్టలనట్లు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అటు నరేంద్ర మోడీని తెగతెంపులు ఇబ్బందిపెట్టేశారు.
మొదటిసారి దానిని రాజ్యసభలో చర్చకి పెట్టినప్పుడు ఓటింగ్ వరకు రానిచ్చి దాని కోసం పార్లమెంటు సమావేశాలనే వాయిదా వేసేశారు. మళ్ళీ ఇప్పుడు సమావేశాలు మొదలైనప్పుడు “అటువంటివి శుక్రవారం తప్ప మరెప్పుడూ చర్చించడానికి మన సాంప్రదాయాలు ఒప్పుకోవు” అంటూ జైట్లీ తప్పించుకొనే ప్రయత్నం చేశారు కానీ ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టేసరికి ఆ సాంప్రదాయాన్ని గట్టున పెట్టి చర్చించక తప్పలేదు. తీరా చేసి రెండురోజులు అందరూ చెమటోడ్చి దానిపై వాగ్వాదాలు, పరస్పర విమర్శలు చేసుకొన్న తరువాత జైట్లీ మళ్ళీ “ఆ ఒక్కటీ అడక్కు” అనే పాతపాటే పాడారు.
దానితో రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కోపం వచ్చేసింది. అది చూసి చంద్రబాబు నాయుడుకి కూడా కోపం వచ్చేసింది. ఆయన కనుసైగ చేయగానే తెదేపా ఎంపిలకి కూడా కోపం వచ్చేసింది. మిత్రపక్షమని కూడా చూడకుండా ప్రతిపక్షాలతో సమానంగా పోటీపడి మరీ పార్లమెంటు లోపలా బయటా ఒకటే హడావుడి చేసేశారు. దానితో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ దిగిరాక తప్పలేదు. చంద్రబాబు డిల్లీ వెళ్లి ఎంత ప్రాధేయపడినా పైసా విదిలించని జైట్లీ స్వయంగా చంద్రబాబుకి ఫోన్ చేసి ఆర్ధిక ప్యాకేజ్ ఇస్తామని, మాట్లాడుకోవడానికి వెంటనే డిల్లీ వచ్చేయమంటే, ఆయన కృష్ణా పుష్కరాల కార్డులు పట్టుకొని డిల్లీలో వాలిపోయారు.
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ చల్లగా చెప్పవలసింది చెప్పేశారు. పార్లమెంటులో ఎటువంటి ప్రకటన చేయమని, పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తరువాతనే దాని గురించి ఆలోచిద్దామని దాని సారాంశం. చంద్రబాబు నాయుడు కూడా మీడియాకి అదే చెప్పేసి తన కర్తవ్యం పూర్తి చేసేశారు. “బాబు-మోడీ ఆర్ నౌ ఫ్రెండ్స్” కనుక రాజ్యసభలో ప్రైవేట్ బిల్లుకి మళ్ళీ ‘ద్రవ్యగ్రహణం’ పట్టించేసి దానిని లోక్ సభలోకి విసిరేసి అరుణ్ జైట్లీ తన పనైపోయినట్లు చేతులు దులిపేసుకొన్నారు. ఇంతకీ “హోదా..హోదా ఎక్కడున్నావే…? అంటే వేసిన చోటే గొంగళీలాగ పడున్నాను,” అనే సమాధానం వినిపిస్తోంది.