హైదరాబాద్: ఉన్నట్లుండి నైరుతి రుతుపవనాలు చురుకుగా మారటంతో కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో నీటి కొరతను తీర్చాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో అనేక జలాశయాలు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, సుంకేశుల, తుంగభద్ర రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా, సింగూర్ రిజర్వాయర్లలోకి భారీవర్షాల వలన పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ఇక నల్గొండ, మహబూబ్నగర్, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ఈ వర్షాల పుణ్యమా అని కరవు పరిస్థితులు తొలగిపోయినట్లే. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని సుమారు 175 చెరువులు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 249 మి.మీ. కాగా గత మూడురోజులు కురిసిన వర్షాలతో అది 251 మి.మీ.కు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో – 7 సెం.మీ.గా, దాని తర్వాత చిత్తూరు జిల్లాలో వెంకటగిరి కోటలో 6 సెం.మీ.గా నమోదయింది. ఇక తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ పోచలో అత్యధికంగా 10 సెం.మీ., దాని తర్వాత నల్గొండజిల్లా సూర్యాపేట మండలంలో 8 సెం.మీ. వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవటం, ట్రాఫిక్ వంటి సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ, నగరానికి నీరందించే రిజర్వాయర్లు నిండుతాయని, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని ప్రజలు సంతోషపడుతున్నారు.