1980 దశకంలో సూపర్ హిట్ జంటగా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి, సుహాసిని. వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ గీతాలెన్నో వచ్చాయి. ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు..’, ‘కరిగిపోయాను కర్పూరవీణలా..’ లాంటి చిరస్మరణీయమైన పాటలున్నాయి. ఇద్దరూ మంచి స్నేహితులు కూడానూ. సుదీర్ఘ విరామం తరవాత వీరిద్దరూ ఒకేతెరపై కనిపించబోతున్నట్టు టాక్.
మలయాళంలో విజయవంతమైన `లూసీఫర్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడు. సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ కథలో కీలకమైన పాత్ర ఒకటుంది. చిరు చెల్లాయి పాత్రలో.. సుహాసిని పేరు పరిశీలిస్తున్నారు. చిరు సినిమా అంటే సుహాసిని ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది? కాకపోతే.. చెల్లాయిగా నటించడానికి ఏమంటుందో చూడాలి. ఒకప్పుడు తెరపై హీరో, హీరోయిన్లుగా నటించినవాళ్లు ఆ తరవాత అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తే… ఆడియన్స్కి ఏదోలా ఉంటుంది. కాకపోతే.. చాలా ముఖ్యమైన పాత్ర. సుహాసిని లాంటివాళ్లు చేస్తేనే ఆ పాత్రకు ఓ హుందాదనం వస్తుంది. మరి సుహాసిని ఏమంటుందో చూడాలి. ‘ఆచార్య’ తరవాత ఈ సినిమా పట్టాలెక్కుతుంది. బహుశా 2021 వేసవిలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లొచ్చు. ఈలోగా కథలో, పాత్ర ధారుల ఎంపికలో చాలా మార్పులు రావొచ్చు.