ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రధానం. మా సినిమా వస్తోందోచ్ అని చెప్పుకోకపోతే, ఎవరి డప్పు వాళ్లు కొట్టుకోకపోతే జనాల దృష్టిలో పడడం కష్టం. అందుకే ఎవరకు తోచిన స్థాయిలో వాళ్లు, ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు వారి వారి ప్రచార వ్యూహాలు పదును పెట్టుకొంటూ ఉంటారు. ఇది వరకు ఆడియో వేడుకతో ప్రచార పర్వానికి కొబ్బరికాయ్ కొట్టేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాలో ఆరు పాటలుంటే.. ఆరూ ఆరు చోట్ల విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఇలా ప్రధాన నగరాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయాక ఈ తిప్పలు మరీ ఎక్కువయ్యాయి. అటు ఆంధ్ర ప్రదేశ్నీ, ఇటు తెలంగాణ ప్రేక్షకులనీ ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలైపోతున్నారు సినిమా వాళ్లు.
ప్రస్తుతం సునీల్ అదే చేస్తున్నాడు. ఈడు గోల్డెహె పాటల ప్రచారంలో బిజీగా ఉన్నాడు సునీల్ . ఉన్న నాలుగు పాటల్నీ ఒక్కో పట్నంలో విడుదల చేస్తున్నారు. రామ్ సినిమా హైపర్ కూడా అంతే. రామ్ అయితే ఛానళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఒక్కో పాట ఒక్కో ఛానల్ ద్వారా లాంచ్ చేస్తున్నాడు. ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్లను నమ్ముకొనే వాళ్లు మరికొంతమంది. రాను రాను ఆడియో వేడుకలు ఉండకుండా.. పాటల వేడుకలుగా మారతాయేమో? ఒకొక్క పాట కోసం ఒకొక్క ఫంక్షన్ ఏర్పాటు చేస్తారేమో? ఇప్పటికే టీజర్, ట్రైలర్లకు కూడా విడిగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏం చేసినా.. జనాల్ని థియేటర్ల వరకూ రప్పించేంత వరకే. సినిమా నిలబడాలంటే మాత్రం అందులో దమ్ముండాలి. ఆ విషయంలో జాగ్రత్త పడితే ఆ తరవాత ప్రచారం కోసం ఇంత పాకులాడాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని కనీసం నవతరం కథానాయకులు, దర్శకులు గుర్తించినా బాగుణ్ణు.