సునీల్ కెరీర్లో ‘పూలరంగడు’ మంచి హిట్. వీరభద్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్టైనర్గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతో0ది. బోగాడి అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తారు. సునీల్లానే… వీరభద్రమ్కి కామెడీ టింజ్ ఉంది. అయితే ఈసారి వీరిద్దరూ కలసి చేయబోతోంది… ఓ క్రైమ్ కథ అని సమాచారం. అయితే అందులోనూ సునీల్ స్టైల్కి తగినట్టు వినోదాన్ని రంగరించినట్టు తెలుస్తోంది. సునీల్ అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్ ఎంటర్టైనర్లు ఎన్ని చేసినా క్రైమ్ కామెడీ జోనర్ టచ్ చేయలేదు. తనకి ఇది కచ్చితంగా కొత్త ప్రయత్నమే అవుతుంది. ఇటీవలే సునీల్కి వీరభద్రమ్ కథ వినిపించాడు. అది సునీల్కి బాగా నచ్చింది. ఈవారంలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నాడు వీరభద్రమ్. మరి ఈ క్రైమ్ కామెడీ వీరిద్దరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.