భారత్-పాక్ సంబంధాలు ఏనాడూ గొప్పగా లేవు. అంతంత మాత్రంగా ఉన్న అవి యూరీ ఉగ్రవాదుల దాడుల కారణంగా ఇంకా దెబ్బ తిన్నాయి. ఇప్పుడు ఇరు దేశాలు ఐక్యరాజ్యసమితి వేదికగా దౌత్య యుద్ధం చేస్తున్నాయి. వాటిలో ప్రస్తుతానికి భారత్ దే పై చెయ్యిగా కనిపిస్తోంది. ఈరోజు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలకి చాలా ధీటుగా జవాబు చెప్పారు.
“ఐక్యరాజ్యసమితి చేత నిషేధించబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతూ, ఇరుగుపొరుగు దేశాలపై దాడులు చేస్తుంటారు. మన మధ్యన కూర్చొని ఉన్న సభ్యదేశాలలో ఒకటి (పాకిస్తాన్) అటువంటి ఉగ్రవాదులకి ప్రోత్సహిస్తూ, ఇప్పుడు ఒక ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. అటువంటి దేశాలకి సమితిలో చోటు ఉండకూడదు. దానిని ప్రపంచ దేశాలు వెలివేయాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
సుష్మా స్వరాజ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “మాపై ఆరోపణలు చేస్తున్న ఆ దేశం బలూచిస్తాన్ లో తన స్వంత ప్రజలపైనే అక్రుత్యాలకి పాల్పడుతోంది. అది చేయకూడని పనులన్నీ చేస్తూ తిరిగి భారత్ నిందిస్తుంటుంది. ఆ దేశంతో చర్చలకి మేము ఇష్టపడటం లేదని, షరతులు విధిస్తున్నామని ఆరోపణలు చేశారు. మా ప్రభుత్వం రెండేళ్ళ క్రితం అధికారం చేపట్టేటప్పుడు, సార్క్ దేశాలన్నిటితో బాటు పాకిస్తాన్ని కూడా సాదరంగా ఆహ్వానించాము. అప్పుడు మేమేమీ నియమాలు, షరతుల గురించి ఆలోచించలేదే! ఆ తరువాత నేను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఎటువంటి షరతులు పెట్టలేదే? మేము పండుగల రోజున, పాక్ ప్రధాని జన్మదినం రోజున ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలుపుతుంటాము. కానీ అందుకు ప్రతిగా పాక్ మాకేమి ఇచ్చిందంటే పఠాన్ కోట్, యూరీ దాడులని బహుమతిగా ఇచ్చింది. పాక్ వైఖరి కారణంగానే దశాబ్దాలుగా రెండు దేశాల సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి,” అని అన్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు పాక్ పట్ల భారత్ వైఖరి చాలా కటినంగా మారడమే కాకుండా ఆత్మరక్షణకి బదులు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. ముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకు అన్నట్లుగా పాక్ ఉగ్రవాదం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలకి కొత్తగా పాఠాలు చెప్పనవసరం లేదు. కనుక వాటి మద్దతు కూడగట్టి ఐక్యరాజ్యసమితి చేత పాకిస్తాన్ పై ఆంక్షలు విదింపజేయగలిగితేనే పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న ఈ దౌత్య యుద్ధంలో విజయం సాధించినట్లు భావించవచ్చు.