ఇటీవల స్వచ్చ భారత్ ద్వితీయ వార్షికోత్సవం జరిపి తమను తామే అభినందించుకున్నారు. ఇదంతా బాగానే వుంది గాని నిజంగా ఫలితాలు లక్ష్యాలకు సుదూరంగా వున్నాయని పర్యావరణ సంస్థల అధ్యయనాలు తెల్పుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన డౌన్ టు ఎర్త్ పత్రిక ఈ విషయమై ఇచ్చిన వివరాలు చూస్తే ప్రచారానికి వాస్తవాలకూ తేడా తెలుస్తుంది. స్వచ్చ భారత్ కింద దేశంలో 8.23 కోట్ల మరుగుదొడ్డు కట్టాలి. అంటే నిముషానికి యాభై ఆరు, నెలకు 23 లక్షలు కట్టాలి. కాని ఎక్కడిదాకానో ఎందుకు ప్రధాని మోడీ స్వంత నియోజకర్గమే గాక హిందువులకు పరమ పవిత్రమైన వారణాసిలోనే ఈ లక్ష్యం నెరవేరింది లేదు. ఇప్పటికి అక్కడ 2,34,489 కట్టవలసి వుండగా కేవలం 7,327 మాత్రమే కట్టారట! ఇక ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత హౌం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహించే లక్నోలో 1,86,177 కట్టాలని నిర్ణయిస్తే 5,332 కట్టి చేతులు దులుపుకున్నారు. ఇవైనా ఎంత వరకూ నిజమో ఏ విధంగా వున్నాయో తెలియదు. సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్ హేమాహేమీల నియోజకవర్గాలన్నిటా ఇదే దుస్థితి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఈ వివరాలు దిగ్భ్రాంతి కలిగించడంతో మరింత మెరుగైన మరో సర్వేను మీడియాలో ముందకు తెచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, మరో మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో స్వచ్చభారత్ బాగా అమలైనట్టు అందులో పేర్కొన్నారు. మరుగుదొడ్డ నిర్మాణం లెక్కలు కూడా ఎక్కువగా ఇచ్చారు.స్వచ్చ భారతం నిర్మించలేకున్నా కనీసం లెక్కలైనా స్వచ్చంగా ఇవ్వాలి కదా?
స్వచ్చభారత్ నినాదం దేశమంతా మార్మోగింది. బడా నేతల నుంచి సినిమా తారల వరకూ సింబాలిక్గా చీపుళ్లు పట్టుకుని అప్పటికే శుభ్రంగా వున్న చోట వేసిన కాస్త చెత్తను వూడుస్తున్నట్టు చేస్తూ బోలెడు ఫోజులిచ్చారు. గాంధీజీ బొమ్మతో ప్రారంభించి ఆరుబట సామూహిక మలవిసర్జనను చూపే చిత్రాలు టీవీలను అలరించాయి. ఆలోచన వుంటే మరుగుదొడ్డి వస్తుంది అంటూ విద్యాబాలన్ యాడ్ నిరంతరాయంగా ప్రసారమైంది. ఆలోచన వుంటే మరుగుదొడ్డి రాదు. నిజానికి చక్కటి టెయిల్స్తో అందమైన టాయిలెట్ కట్టించుకోవాలని ఎవరికి వుండదు? బంజారా హిల్స్లోనూ పొద్దునే పొదల చాటుకు కొండల మాటుకు వెళ్లి కాలకృత్యం కానిచ్చేస్తున్నారంటే గతిలేకే!ఆలోచన లేక కాదు! అసలు ఇళ్లే లేని వాళ్లు జానెడంత అద్దె కొంపల్లో వుండే వాళ్లు ఫుట్పాత్లపై బతికేవాళ్లు ఎంత ఆలోచిస్తేనేం?