మార్చ్ 1వ తేదీ నుంచి తమిళ సినిమా ఇండస్ట్రీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (క్యూబ్, యు.ఎఫ్.ఓ.)లకు వ్యతిరేకంగా సమ్మె ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు విడుదల చేయడకుండా థియేటర్లను మూసేశారు. మొదట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు జేఏసీ కింద ఏర్పడి థియేటర్లను బంద్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ కొన్ని రోజుల తర్వాత బంద్ విరమించగా… తమిళ ఇండస్ట్రీ ఈ నెల 16వ తేదీ నుంచి ఏకంగా 24 క్రాఫ్ట్స్ బంద్కు పిలుపు ఇచ్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. తమిళ మంత్రి కదంబుర్ రాజా సమక్షంలో జరిగిన సమావేశంలో చెన్నై థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లు సమ్మెను విరమించడానికి అంగీకరించారు. నిన్నటి నుంచే సినిమాలు ప్రదర్శించడానికి సుముఖత వ్యక్తం చేశారు. కానీ, ప్రదర్శించడానికి సినిమాలే లేవు. థియేటర్లు తెరవడానికి ఓనర్లు, ఎగ్జిబిటర్లు మాత్రమే అంగీకరించారు. తమిళ సినిమా ఇండస్ట్రీ అంగీకరించలేదు. వాళ్ళు ఇంకా సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు. దాంతో థియేటర్ల ఓనర్లు పాత సినిమాలను లేదా ఇతర భాషల సినిమాలను ప్రదర్శించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లకు, ఇండస్ట్రీకి మధ్య చిన్నపాటి యుద్ధమే మొదలైంది. దీనిపై తమిళ ఇండస్ట్రీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.