ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో 3వ తేదీన వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్ కార్యక్రమం, మహాసభల మొదటిరోజు కార్యక్రమాలకు దాదాపు 12వేలమంది రావడంతో నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు. చివరిరోజున ఈ సంఖ్య మరింత పెరగవచ్చని వారు చెప్పారు. ఆటలు, పాటలు, సంగీత విభావరులు, సినిమా స్టార్ ల మాటలు, మెరుపులు, రాజకీయ నాయకుల ప్రసంగాలు వెరసి తానా మహాసభలు వేలాదిమందిని ఆకట్టుకున్నాయి.
జూలై 3వ తేదీన జరిగిన బాంక్వెట్ కార్యక్రమాలు తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు. కాన్ఫరెన్స్ నాయకులు సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల, జో పెద్దిబోయిన తదితరుల ఆధ్వర్యంలో సాగాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో సేవలందించిన వారికి తానా మెరిటోరియస్ అవార్డులను బహుకరించారు. సైంటిఫిక్ రీసెర్చ్, ఎంట్రప్రెన్యూర్ షిప్ లో ప్రతిభ చూపినందుకుగాను డా. బెజవాడ శ్రీనివాసరావుకు అవార్డును బహకరించారు. మెడిసిన్ విభాగంలో డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ కు అవార్డును ఇచ్చారు. లిటరేచర్ విభాగంలో తానాఎక్సలెన్స్అవార్డును డాక్టర్ వడ్లమూడిబాబుకు అందించారు. అకాడమిక్ ఆచీవ్మెంట్స్కుగాను నాదెళ్ళ ప్రణయ్ కు, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ప్రతిభ చూపిన యార్లగడ్డ రఘుకు, పొలిటికల్ విశ్లేషకుడు ఆది సతికి, మెడిసిన్,కమ్యూనిటీ సర్వీస్ కు గాను డా. కాకర్ల జగన్మోహనరావుకు, సాహిత్యవిభాగంలో ప్రసాద్ తోటకూరకు, తెలుగు బ్రాడ్ కాస్టింగ్ లో ఉదయగిరి రాజేశ్వరికి, మెడిసిన్, జీన్ థెరపికి గాను డాక్టర్ ముసునూరు కిరణ్కు, ఫైనాన్స్ టెక్నాలజీలో డాక్టర్ పరుచూరి శ్రీనివాస్కు, సర్వీస్ విభాగంలో డా. నల్లమోతు బ్రహ్మాజీకి, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్లో డా. చెరుకుపల్లి నెహ్రూకు, అగ్రికల్చర్ విభాగంలో పాతూరి నాగభూషణంకు, కమ్యూనిటీ సర్వీస్ లో తిపిర్నేని తిరుమలరావుకు, ఆర్ట్స్ విభాగంలో శ్రీమతి ఆసూరి విజయకు, కళల విభాగంలో శ్రీమతి సంధ్యశ్రీ ఆత్మకూరికి, మెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డా. కొట్టమసు సాంబశివరావుకు, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో కోగంటి సునీల్ కు, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో గోరంట్ల వాసు బాబుకు, సినిమా క్రాప్ట్స్ అండ్ ఆర్ట్స్ విభాగంలో మిరియాల అరుణ్కు, తానా ప్రత్యేక ప్రశంస అవార్డును కొడాలి నరహరికి, చెరుకూరి రవి, వంకాయలపాటి శ్రీనివాస్కు, గోగినేని సతీష్, అప్పలనేని నవీన్, భద్రరాజు సుబ్రహ్మణ్యం, కిలారు అనిల్, ఆలపాటి బిల్హన్, గౌతమ్ అమర్నేని తదితరులకు అవార్డులను బహకరించారు. పలువురు డోనర్లు, తానా నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకలకు తరలివచ్చారు.
జూలై 4వ తేదీన కాన్ఫరెన్స్ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 8వేలమందికిపైగా తెలుగువాళ్ళుకుటుంబ సమేతంగా ఈ వేడుకలకు తరలిరావడంతో ప్రాంగణమంతా తెలుగుపండుగ వాతావరణం కనిపించింది. దానికితోడు నిర్వాహకులు ఏర్పాటు చేసిన అలంకరణలు, కార్యక్రమాలు తెలుగు వైభవాన్ని మరోసారి అమెరికన్లకు తెలియజేసింది. సుమారు వంద మంది కళాకారుల‘తర తరాల తెలుగు వైభవం’ పై ప్రదర్శనలిచ్చారు. తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టేలా కళారత్న కేవీ సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన ఈ నృత్యరూపకం అందర్నీ ఆకట్టుకుంది. గౌతమీపుత్ర శాతకర్ణి, కాకతీయుల రుద్రమ, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహోన్నత తెలుగు చక్రవర్తులను ఈ ప్రదర్శనలో గుర్తుచేసుకున్నారు. అలాగే కవిత్రయం, బమ్మెర పోతన, అల్లసాని పెద్దన, వేమన, అన్నమయ్య, శ్రీ రామదాసు, త్యాగరాజు వంటి కవుల విశేషాలను వివరించారు.
కాన్ఫరెన్స్ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, గంగాధర్ నాదెళ్ళ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లిని, ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షులు హనుమయ్య బండ్ల, ప్రసాద్ తోటకూర, జయరాం కోమటి, లావు అంజయ్య చౌదరితోపాటు కాన్ఫరెన్స్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి పిఠాని సత్యనారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, నటుడు మురళీ మోహన్ కూడా వేదికపైకి వచ్చి మాట్లాడారు. భగవద్గీత ప్రవచన కర్త గంగాధర్ శాస్త్రి, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ కూడా ఈరోజు వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల ఎన్నారైల సమావేశం, కృష్ణాజిల్లా ఎన్నారైల మీట్, అమరావతి ఎన్నారైల సమావేశం జరిగింది. ఇందులో ఆయా ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు ఎన్నారైలు పాల్గొని ఆయా జిల్లాలకు అవసరమైన విషయాలపై చర్చించారు.
తానా రెండవ రోజున కూడా పలువురిని ఘనంగా సత్కరించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారెని తానా గౌరవించింది. తెలుగు చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తిస్తూ.. తానా ఎన్టీఆర్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. తెలుగుసినీరంగానికిచెందిన ఐశ్వర్య రాజేష్, నిఖిల్, రాజేంద్రప్రసాద్, యెర్నేని నవీన్ తదితరులను కూడా తానా నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారు ప్రసంగించి తానా చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఎన్నారైల కృషిని అభినందించారు. ఫ్యాషన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు, సునీత్-ఎస్పీ చరణ్ల సంగీత విభావరి ఆకట్టుకుంది. సుమ వ్యాఖ్యాతగా కార్యక్రమాలను ఆకట్టుకునేలా నిర్వహించారు.