తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రెండో రోజే 11 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండయ్యారు. వాయిదా తీర్మానాలపై పట్టుబట్టిన 9 మంది కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర పట్టుబట్టారు. స్పీకర్ సభలోకి వచ్చీ రాగానే తమ డిమాండ్ పై పట్టుబట్టారు. దీంతో వీరందరినీ స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేశారు.
సమావేశాల తొలిరోజు పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై చర్చ జరపాలని ముందే నిర్ణయించారు. దీంతోప్రతిపక్షాలు మరో అంశంపై పట్టుబట్టలేదు. ఈ అంశంపై ఎవరికి వారు తమ వాదన వినిపించడానికి సిద్ధపడి వచ్చారు. రెండో రోజు శనివారం మాత్రం మళ్లీ అరుపులు నినాదాలు డిమాండ్లు వినిపించాయి.
శుక్రవారం ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇవే సీన్లు కనిపించాయి. అయితే సభ్యులను సస్పెండ్ చేయకుండా సభను వాయిదా వేశారు. అసెంబ్లీలోమాత్రం సభను వాయిదా వేయకుండా కొనసాగించారు. సభకు ఆటంకం కలిగించే వారిని బయటకు పంపారు.
సస్పెండ్ అయిన తర్వాత రేవంత్, సండ్ర స్పీకర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. అయితే వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ వైఖరిపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అవసరమైతే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. స్పీకర్ పరిధిలో ఉన్న అంశంపై పట్టుబట్ట వద్దని స్వయానా స్పీకరే చెప్పారు. ఇది తన విచక్షణకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష సభ్యుల డిమాండ్లు సహేతుకమా కాదా అనేది వేరే విషయం. సభకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీ ఈ విధంగా స్పష్టం చేసింది. దీనపై సీఎల్ పి నాయకుడు జానారెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. అయినా, సభలోచర్చ తప్ప రచ్చకు అవకాశం లేదని కేసీఆర్ ప్రభుత్వం కచ్చితమైన సంకేతాన్ని ఇచ్చినట్టయింది.