తెలంగాణ రాజకీయాలు మెల్లగా బెంగాల్ తరహాలో మారుతున్నాయి. అక్కడ గవర్నర్ రాజకీయ నాయకుడి కంటే ఘోరంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రకటనలు చేస్తూ ఊంటారు. అక్కడ రాజకీయం అలాంటిది. తెలంగాణలో ఇప్పటి వరకూ ఇలాంటి పరిస్థితి లేదు.కానీ రిపబ్లిక్ డే రోజున రాజ్ భవన్ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనకపోవడంతో అలాంటి రాజకీయానికి బీజం పడినట్లయింది. కేసీఆర్ కావాలనే రాజ్ భవన్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. దీనికి కారణం గవర్నర్ ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూండటమేనని చెబుతున్నారు.
పరేడ్ గ్రౌండ్ లేదా పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజ్భవన్కు పరిమితం చేశారు. దానికీ కేసీఆర్ హాజరు కాలేదు. సాధారణంగా రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం అందించే గణాంకాలను గవర్నర్ చదువుతుంటారు. కానీ, ఈసారి అలా జరగలేదు. పైగా గవర్నర్ తన ప్రసంగంలో ప్రధాని మోదీని రెండు సార్లు పొగిడారు. మామూలుగా కేబినెట్ ఆమోదించి పంపింది చదువుతారు. కానీ తమిళిశై… స్వయంగా తయారు చేసుకుని చదివారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ తమిళిసై ఇటీవల తెలంగాణ ప్రగతి గురించి ఎక్కడా చెప్పడం లేదు. కేంద్రం గురించి మాత్రమే చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్ చదివిన స్పీచ్ కాపీని క్యాబినెట్ ఆమోదించలేదని తెలుస్తోంది.
బీజేపీతో ఇటీవల పెరిగిన విభేదాల కారణంగానే గవర్నర్ తమిళిసై తో కేసీఆర్ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్పై అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవానికీ గైర్హాజరయ్యారు. అంటే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్తో దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ దూరం ఇలాగే పెరిగితే.. ఇక బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు ఎలా యాక్టివ్ అయ్యారో.. అలా తమిళిసై కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.