తెలంగాణ ప్రజాకూటమిలోని పార్టీ సీపీఐ మూడు సీట్లతో సర్దుకుపోయింది. ఆయా స్థానాలను కూడా.. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడంతో అభ్యర్థులను కూడా ప్రకటించింది. హుస్నాబాద్ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, బెల్లపల్లి- గుండ మల్లేష్, వైరా- బానోతు విజయబాయిలను ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి జాబితా విడుదల చేశారు. కూటమిలో సీపీఐకి మూడు సీట్లనే కేటాయించడం పట్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికి కేసీఆర్ను గద్దె దించడానికి తాము ఒప్పుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ మూడు సీట్లే ఫైనల్ అన్నారు. సీట్లకోసం ఇకపై కాంగ్రెస్ను కలిసేదిలేదని స్పష్టం చేశారు. నల్గొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. హుస్నాబాద్లో చాడపై రెబల్గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి విషయాన్ని ఆ పార్టీ చూసుకోవాలన్నారు. రెబల్స్ ఉండకూడదనే తమకు కేటాయించిన మూడు సీట్ల నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్నామని సీపీఐ నేతలు చెబుతున్నారు.
సీపీఐ మొదట 12 సీట్లు కావాలని డిమాండ్ చేసిన సీపీఐ.. తర్వాత కనీసం 5 స్థానాలైనా కేటాయించాలని కోరింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం 3 సీట్లనే ఇస్తామని తేల్చిచెప్పింది. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలంటే కూటమితో కలిసి పోటీ చేయడం అనివార్యంగా భావిస్తున్న సీపీఐ.. 3 సీట్లకు ఓకే చెప్పింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో మహాకూటమిలో సీపీఐ వాటా ముగిసిపోయినట్లయింది. ఇక టీజేఎస్, టీడీపీ విషయంలో మాత్రం.. ఇంకా ఎడతెగని చర్చలు జరురుగుతున్నాయి. టీడీపీ ఇంకా నాలుగు స్థానాలు కేటాయించాల్సి ఉంది. టీజేఏస్ కి ఇప్పటికి ఆరు స్థానాలపై క్లారిటీ ఇచ్చారు. మరో రెండు సీట్లను చూపించాల్సి ఉంది. అయితే ఈ సీట్ల వ్యవహారం అంతా తేలిగ్గా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.
టీడీపీకి కేటాయించాల్సిన నాలుగు స్థానాలుగు దాదాపుగా గ్రేటర్ లోనే ఉండనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులున్నారు. వారికి సర్దుబాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తంటాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెబల్స్ బెడద లేకుండా.. ఏం చేయాలా అన్నదాన్ని ఆలోచించడానికి… మహాకూటమికి సమయం దొరకడం లేదు.