తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఆసరా పెన్షన్ల నుంచి రైతు రుణమాఫీ వరకూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బేగంపేటలోని అధికార నివాసంలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రజల సంక్షేమం కోసం ఎంతెంత ఖర్చు పెడుతోందోలెక్కలు చెప్పారు. 30 వేల కోట్ల రూపాయలకు పైగా సంక్షేమంపై ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పనకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమలను తెలంగాణకు రప్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పుకోసం తపించే ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు. పలు అంశాల్లో ప్రజాహితంగా ఎలా మసలుకోవాలో ఆయన కలెక్టర్లకు హితబోధ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పరిచామని, గుడుంబాను అరికట్టామని వివరించారు. జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో నిధులకోసం కలెక్టర్లు తడుముకునే పరిస్థితి ఉండొద్దన్నారు. అందుకోసం ప్రతి జిల్లాకు 3 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామన్నారు. అనడమే కాదు, ఈ మేరకు రూ. 93 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత మొదటిసారిగా కలెక్టర్లతోఆయన సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వివిధ అంశాలపై తమకు మార్గదర్శనం చేశారని కొందరు కలెక్టర్లు మీడియాకు తెలిపారు.