వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి.. ఈ సారి టిక్కెట్ల పంపిణీ అంత సులభం అయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా… కుటుంబం నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో..అందర్నీ సర్దుబాటు చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ టిక్కెట్ దక్కని వారు .. రోడ్డెక్కితే.. మొత్తానికే తేడా వస్తుందన్న ఆందోళనతో ఇప్పటికే… వైఎస్ కుటుంబంలోని కొంత మంది పెద్దలు ఉన్నారు. టిక్కెట్ల విషయం చర్చలు ప్రారంభిస్తే.. మొత్తానికే తేడా వస్తుందని గుంభనంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా… అందరి మాటలు వింటున్నారు కానీ..ఎవరికీ హామీ ఇవ్వడం లేదు.
కడప ఎంపీ స్థానం నుంచి ఈ సారి.. జగన్ సోదరి షర్మిల పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేశారు. ఈ కారణంగా ఆమెకు ఈ సారి టిక్కెట్ ఇవ్వాల్సిందేనన్న వాదన కుటుంబంలోనే వినిపిస్తోంది. అయితే ఇప్పటికే.. రాజీనామా చేసినప్పటికీ కడప సిట్టింగ్ ఎంపీగా మరో సమీప బంధువు అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయనను తొలగిస్తే.. కుటుంబంలో విబేధాలు రావడం ఖాయమే. అందుకే.. అవినాష్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ సర్దుబాటు చేయాలి. ఇక వైఎస్ వివేకా, విజయమ్మలను కూడా అసెంబ్లీ బరిలోకి దించాలనే ఒత్తిళ్లు జగన్ పై వస్తున్నాయి. ఇప్పటికే.. కమలాపురం నుంచి ..మేనమాన రవీంధ్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయచోటి నుంచి .. మరో బంధువు ద్వారకనాథ్ రెడ్డి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నప్పటికీ.. విజయసాయిరెడ్డి… ద్వారనాథ్ రెడ్డికి భరోసా ఇచ్చేశారు.
రాజకీయంగా తమకు భరోసా దక్కడం లేదన్న కారణంతో.. వైఎస్ సోదరుడు.. మనోహర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ గా…
ప్రస్తుతం వైఎస్ మనోహర్ రెడ్డి భార్య వైఎస్ ప్రమీలమ్మ ఉన్నారు. మున్సిపాల్టీలో ఇతర వైఎస్ కుటుంబ సభ్యుల జోక్యం పెరిగి.. చైర్మన్ గా ఉన్న మనోహర్ రెడ్డి, ప్రమీలమ్మ మాటకు విలువ తగ్గడంతో మనోహర్ రెడ్డి ఓ సందర్భంలో టీడీపీలో చేరిపోవడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో అగిపోయినా… ఎన్నికలు దగ్గర పడే సమయానికి.. కుటుంబంలో టిక్కెట్ల చిచ్చు ఏర్పడి.. ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదటున్నారు. మొత్తానికి జగన్ టిక్కెట్లు ఆశిస్తున్న కుటుంబ సభ్యులందరికీ అవకాశాలు కల్పించాలంటే.. అన్ని జిల్లాల్లోనూ.. ఒక్కో సీటు కుటుంబానికి రిజర్వ్ చేయాల్సిందేనని.. సెటైర్లు వినిపిస్తున్నాయి.