వణికించే చలిలో విమర్శల మంటలు తప్పవా? తెలంగాణ శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వంపై నిప్పుడు చెరగడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 16 నుంచి జరిగే సమావేశాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శలు చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు రైతు సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. రుణ మాఫీ అమలు, ప్రాజెక్టుల భూసేకరణ, నష్టపరిహారం తదితర విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా అసెంబ్లీలో విమర్శనాస్త్రాలు సంధించడం ఖాయం.
డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ ఎస్టీలకు భూమి పంపిణీ వంటి హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన కేసీఆర్ ప్రభుత్వం, రైతుల కష్టాలను తీర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ నిందిస్తోంది. సామాన్య ప్రజలు కూడా డబ్బుకోసం పడుతున్న కష్టాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
జిల్లాల విభజన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. జిల్లాల విభజనలో శాస్త్రీయత లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అది రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి. అటు బీజేపీ సైతం రైతు సమస్యలు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై దండెత్తడానికి సిద్ధమవుతోంది. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేసీఆర్ సమర్థించినా, రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటూ కమలనాథులు కూడా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. అయితే సంఖ్యాపరంగా ప్రతిపక్షాన్ని నామమాత్రం చేయడంతో సభలో విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి అధికార పార్టీ కూడా సిద్ధమవుతోంది.