మాజీ ఎంపీఉండవల్లి అరుణ్ కుమార్ ఆమధ్య పవన్ కళ్యాణ్ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ లో పాల్గొనడం, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి రూపొందించిన నివేదికకు తనవంతు సమాచారం అందించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి ఆయనకు చెడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో , ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆయనకు సంధించింది . దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఆ ప్రముఖ ఛానల్ లోని యాంకర్, మీకు పవన్ కళ్యాణ్కు ఈమధ్య చెడినట్లు కనిపిస్తోందని, ప్రత్యేకించి చంద్రబాబుని మీరు కలిశాక అలాంటి అభిప్రాయం జనాల్లో కలుగుతోందని ప్రశ్నించగా ఉండవల్లి కుండబద్దలు కొట్టినట్టు సమాధానమిచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ లో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారని , అలాంటి నిపుణులతో పాటు తనను కూర్చోపెట్టి తనకెంతో గౌరవించాడని అందువల్ల పవన్ కళ్యాణ్ మీద తనకు ఇప్పుడు గౌరవం అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక చంద్రబాబుని తానే అపాయింట్మెంట్ కోరినట్టు కొన్ని మాధ్యమాలలో వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. తాను చంద్రబాబు అపాయింట్మెంట్ ఎప్పుడు కోరలేదని, చంద్రబాబే తనను ఆహ్వానించాడని, ముఖ్యమంత్రి పిలిచారు కాబట్టి వెళ్లి కలిశానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ యాంకర్ అక్కడితో ఆగకుండా, జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ తర్వాత పవన్కళ్యాణ్ మీకు ఎప్పుడు పెద్దపీట వేయాలేదే అని ప్రశ్నించగా, తాను రాజకీయాల నుంచి రిటైర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ కు తెలిపానని అందువల్ల ఆయన తన వ్యవహారాలలో కి నన్ను పిలవక పోయి ఉండవచ్చని చెబుతూ పవన్ కళ్యాణ్ మీద తన అభిప్రాయం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.