ఉలవచారు బిరియానీ, మన ఊరి రామాయణం.. ఇలా అచ్చమైన తెలుగు పేర్లతో సినిమాలు తీస్తున్న నట దర్శకుడు ప్రకాష్ రాజ్. మన ఊరి రామాయణం ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ఆయన మరో సినిమాకి రంగం సిద్దం చేస్తున్నారు. ఈసారీ వెరైటీ టైటిల్నే ఎంచుకొన్నారు. పేరేంటో తెలుసా… ‘అరవై ఏళ్లు – ఛామన ఛాయ’. ఆల్జీమర్ వ్యాధితో బాధపడే ఓ వృథ్దుడి కథ ఇది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందనుంది. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయట. అరవై ఏళ్ల వృద్దుడి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదట. స్క్రిప్టు పక్కాగా పూర్తయ్యేకే నటీనటుల్ని నిర్ణయిస్తారని తెలుస్తోంది. 2017 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రానికీ ఇళయరాజానే స్వరాలు సమకూరుస్తారని సమాచారం.
నటుడిగా సంతృప్తికరమైన ప్రయాణం సాగిస్తున్న సమయంలోనే దర్శకుడిగా అడుగుపెట్టాడు ప్రకాష్ రాజ్. ధోని బాగానే ఉందనిపించింది. ఉలవచారు లెక్క తప్పింది. మరి మన ఊరి రామాయాణం ఎలా ఉంటుందో? దర్శకుడిగా తన జయాపజయాల గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ”కష్టపడి పనిచేయడం ఒక్కటే ఎవరి చేతుల్లో అయినా ఉంటుంది. నేనూ అదే చేశా. నా సినిమాలు జనానికి రీచ్ అవ్వకపోవడానికి కుంటు సాకులు చెప్పదలచుకోలేదు. దర్శకుడిగా ఇదంతా నేర్చుకొనే ప్రయత్నంలో భాగమే” అంటున్నారాయన.