కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏ విషయ మీదనైనా ఆసక్తికరంగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే అలవోకగా మాట్లాడతారు! మాటల్లో ప్రాసలు, పంచ్లు అడుగడుగునా వేస్తూనే ఉంటారు. ఇక, మీనింగులు చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి. ప్రధానమంత్రి మోడీ పేరుకి మీనింగ్ ఏంటో ఆ మధ్య చెప్పారు. మోడీ అంటే ‘మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా’ అన్నారు. మొన్నటికి మొన్న విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… స్పెషల్ స్టేటస్ అంటే అర్థం చెప్పారు! ‘స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ స్టేట్. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేట్’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇక, నిన్నటి విషయానికొస్తే… హైదరాబాద్లో దసరా అనంతరం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు వచ్చారు. ఇక్కడ కూడా ఆయన ప్రాసక్రీడల ప్రసంగాన్ని కొనసాగించారు. భారతీయ సంస్కృతి అంటే ఏంటో సులువుగా అర్థమయ్యే నిర్వచనం చెప్పారు.
సంస్కృతి అంటే ఏంటనీ, దాన్ని అర్థమయ్యే భాషలో చెప్పాలంటూ ఒక పెద్దాయన ఈ మధ్యనే ప్రశ్నించాడని వెంకయ్య చెప్పారు. తాను కాసేపు ఏదో చెప్పాననీ, అయినా ఆయనకి అర్థం కాకపోవడంతో ఒక్క ముక్కలో విషయం ఇంకోలా చెప్పాను అన్నారు. ‘నీ రొట్టెను నువ్వు తింటే.. అది ప్రకృతి. నువ్వు పక్కవాడి రొట్టెను లాక్కుని తింటే వికృతి. నీ రొట్టెను పక్కవాడికి పెడితే అది సంస్కృతి… అర్థం చేసుకో’ అని చెప్పానన్నారు. ఇది చెప్పగానే సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో నిండింది. చీమకు చక్కెర పెట్టీ పాముకు పాలు పోస్తాం, చెట్టుకు బొట్టు పెట్టీ పశువుకి దండం పెట్టే గొప్ప సంస్కృతిగల పవిత్ర భారతదేశం మనది అన్నారు. ఇలాంటి దేశంలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో ప్రజలను విడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
సరిగ్గా మూడు రోజుల క్రితం జరిగిన ఏపీ పోస్టల్, టెలీకమ్యూనిషన్స్కు చెందిన ఓ కార్యక్రమంలో హిందీ గురించి కూడా ఇలానే ఆసక్తకిరంగా మాట్లాడారు వెంకయ్య నాయుడు. తన చిన్నప్పుడు నెల్లూరులో హిందీ వ్యతిరేక ఆందోళనలు జరుగుతుంటే, దాన్లో తానూ పాల్గొనేవాడనని గుర్తు చేసుకున్నారు. అయితే, నెల్లూరులో ఎక్కడా హిందీ కనిపించడం లేదనీ, దాంతో ఆందోళన ఎలా చేయాలని అర్థం కాకపోతే… చివరికి పోస్టాఫీస్ డబ్బా మీదా, రైల్వే స్టేషన్ బోర్డు మీదా హిందీ ఉందని తెలుసుకుని వాటిపై తారు పూసి వచ్చానన్నారు. కానీ, ఢిల్లీ వెళ్లాక తెలిసిందీ… ఆ రోజు తారు పూసింది అక్కడ కాదు ,నా నెత్తమీదే అని చమత్కరించారు. లేటు వయసులో ఘాటు ప్రేమ మంచిది కాదంటారనీ, కానీ ఢిల్లీ వెళ్లాక హిందీ నేర్చుకోవడం తప్పలేదని అన్నారు. దేశంలో తిరిగాలంటే సేవ చేయాలంటే హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విధంగా తన ప్రసంగాల్లో ఏదో ఒక ఆసక్తికరమైన టాపిక్ ఉండేలా వెంకయ్య బాగానే జాగ్రత్తపడుతున్నారు!