ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక సహాయంపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు మాన్యశ్రీ సీనియర్ కేంద్రమంత్రి వర్యులు మాన్యశ్రీ వెంకయ్య నాయుడు ఆ సభలో చాలా మందికి తెలియని దేవాంతకుడు సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు.యమగోలకు మాతృక లాటి దేవాంతకుడులోనూ ఎన్టీఆర్ యమలోకం వెళతారు. అక్కడ అసహాయ వితంతువు సూర్యకాంతంకు ఏదో శిక్ష వేస్తారు. ఏమంటే ఆమె ఏకాదశి నాడు ఉపవాసం వుండి కూడా ఏదో తినాలని అనుకున్నదట. అనుకుంటే పాపం ఎలా అవుతుందని హీరో ప్రశ్నిస్తాడు. పాపమే అంటాడు యముడు. అయితే నా పుణ్యం కొంత ఆమెకు ధారపోస్తానంటాడు. ఇతగాడి ఖాతాలో పాపం తప్ప పుణ్యం లేదంటాడు చిత్రగుప్తుడు. అదేమిటి నేను ఇందాక వచ్చేప్పుడు సత్రాలు కట్టించాలని దేవాలయాలు కట్టించాలని చాలా అనుకున్నాను అంటాడు. అనుకుంటే అయిపోతుందా అని అడిగిన సిహెచ్గుప్తా చిక్కులో పడిపోతాడు. వెంకయ్య నాయుడు ఈ సీనేమా కథ ఎందుకు చెప్పారంటే కాంగ్రెస్ ప్రత్యేక హౌదా ఇవ్వాలనుకున్నది గాని ఇచ్చేందుకు చట్టంలో పెట్టలేదు అని అపహాస్యం చేయడానికి. .తర్వాత ఇంతకాలం జరిగిందీ ఇప్పుడు జరుగుతున్నది ప్రజలు చూస్తూనే వున్నారు.
ఇప్పటి పరిస్థితి చూస్తే మనకు ఎన్టీఆర్ దేవాంతకుడుతో పాటు మహేష్ బాబు ‘అతడు’ డైలాగ్ లేదా సినీ సూక్తి గుర్తొస్తుంది. నిజం చెప్పకపోవడం అబద్దం. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అంటాడు అతడులో మహేష్బాబు(త్రివిక్రమ్ శ్రీనివాస్ సాక్షిగా).
అప్పుడు అడిగారు, తెచ్చామన్నారు,ఇస్తామన్నారు..ప్రణాళికలో పెట్టారు. ప్రధాని కాబోయే పెద్ద మనిషి సమక్షంలో ప్రచారం చేశారు. కాబట్టి దేవాంతకుడు కంటే చాలా అడుగులు వేసినట్టు కదా. ఇది దేవాంతకుడు తరహాలోకి వస్తుందో లేక అతడులో చెప్పిన అబద్దం/మోసం తరహాలోకి వస్తుందో వారే నిర్నయించుకుంటారు.
రాజకీయాలలో అగ్రనేతలు ఒక్క మాటకు -సత్యం కాకపోయినా అసత్యానికైనా – ఒక్క మాటకు కట్టుబడి వుండాలని ప్రజలు కోరుకుంటారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హౌదాకు ఒప్పుకోలేదని ఎన్నిసార్లు చెప్పారు? నీటి ఆయోగ్ చూసుకుంటుందని ఎన్నిసార్లు దాటేశారు? సాక్ష్యాలతో సహా నిరూపించడం పెద్ద సమస్య కాదు. నీటి ఆయోగ్ ఉపాద్యక్షుడు అరవింద్ పనగారియా స్వయంగా తమకు సంబంధం లేదని చెప్పాక గాని ఆ ప్రచారం ఆగలేదు.ఇక 14వ ఆర్థిక సంఘం ఆటంకమనేది అసత్యమని నేను 2016 మే29 మొదటి సారి తెలుగు 360లో రాశాను. అప్పటి వరకూ ఆ తరహా చర్చ జరిగిందే లేదు. తర్వాత కూడా కొంత సమర్థన కొనసాగించారు. ఆఖరుకు అరుణ్జైట్లీ ఇదే వెంకయ్య నాయుడు తదితరులతో కలసి నిర్వహించిన ఉత్తుత్తి ప్కాకేజీ మీడియా సమావేశంలోనూ చెప్పడమే గాక అందుకు ఆధారంగా వుండే పేరాగ్రాఫులు విడుదల చేస్తామన్నారు. ఆ విడుదల చేసిన పేరాల్లో ఈ వూసే లేదని కూడా నేను గట్టిగా నిరూపించాను. ఇదంతా అయ్యాక ఇప్పుడు మన పెద్దాయన 14వ ఆర్థిక సంఘం వద్దన్నట్టు తాము చెప్పలేదంటున్నారు. అనుకోకుండా ఈ రోజు టివి తిప్పేప్పుడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుండగా సరిగ్గా ఈ మాటలే వినపడ్డాయి.
నిజంగా వెంకయ్య నాయుడేగాక ఇంకా చాలా మంది పెద్దపెద్దవాళ్లు 14వ ఆర్థిక సంఘం ఆటంకమని చెప్పారా లేదా? దీన్ని కూడా క్లిప్పింగులతోనూ నిరూపించడం పెద్ద పని కాదు. అందుకే నేనంటున్నాను- అవాస్తవమైనా సరే ఒక దానికి కట్టుబడి వుంటే కొంతలో కొంతలో కొంత మెరుగని..